ఏపీలో చాప కింద నీరులా బీజేపీ విస్తరిస్తూ వస్తోంది.ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు గతంలో ఏపీ బీజేపీ అధ్యక్షులుగా పని చేసిన వారి కంటే భిన్నంగా వ్యవహరిస్తూ, దూకుడుగా ముందుకు వెళ్తున్నారు.
పార్టీని ఏపీలో బలోపేతం చేయడమే ఏకైక లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు.ఈ క్రమంలో ఏపీ అధికార పార్టీ వైసిపి, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలను సమాన దృష్టితో చూస్తూ, విమర్శలు చేయడంలో ముందుంటున్నారు.
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ, నిత్యం హడావుడి చేస్తున్నారు.ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఆదరణ బాగా తగ్గడం, కోలుకునే అవకాశాలు ఇప్పట్లో కనిపించకపోవడంతో, ఇదే ఏపీలో బీజేపీ బలపడేందుకు సరైన సందర్భం అని భావిస్తున్న సోము వీర్రాజు, టిడిపిని మరింత దెబ్బతీసే విధంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ స్థానంలో బీజేపీని నిలబెట్టాలని ఆయన చూస్తున్నారు.ఈ క్రమంలోనే తీవ్రస్థాయిలో సోము వీర్రాజు విమర్శలు చేస్తున్నా, తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన విమర్శలకు కౌంటర్ ఇచ్చే వారు కనిపించడం లేదు.
ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబు ఎందుకో తెలియదు గాని, ఈ విషయంలో పూర్తిగా సైలెంట్ అయిపోయినట్టుగా కనిపిస్తున్నారు.బీజేపీ ఎన్ని విమర్శలు చేస్తున్నా, తిరిగి సమాధానం చెప్పడం లేదు.
అదే సమయంలో వైఎస్సాఆర్ సీపీ నాయకులు చేస్తున్న విమర్శలకు గట్టిగానే టిడిపి సమాధానాలు ఇస్తోంది తప్ప, బీజేపీ విషయంలో పూర్తిగా సైలెంట్ అయిపోవడం అనేక అనుమానాలు కలిగిస్తోంది.
ఇదే విషయమై టిడిపి అధినేత చంద్రబాబును మీడియా ప్రశ్నించగా, ఏపీలో ఓటు బ్యాంకు లేని బీజేపీ విమర్శించినా, మేము పట్టించుకోమని తప్పించుకునే ధోరణిలో సమాధానం చెబుతున్నారు.కానీ టిడిపి శిబిరం బీజేపీ విషయంలో పూర్తిగా సైలెంట్ అయిపోవడం వెనుక కారణాలు వేరే ఉన్నాయి అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.ఏపీలో బలంగా ఉన్న అధికార పార్టీ వైసీపీని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే, బీజేపీ సహకారం తప్పనిసరి అనే అభిప్రాయం బాబు లో ఉంది.
అందుకే బీజేపీ ఎన్ని విమర్శలు చేస్తున్నా, పట్టించుకోనట్టు గానే వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
టిడిపి కీలక నాయకులు సైతం బీజేపీ విషయంలో తొందరపడవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి విమర్శలు చేయవద్దని ఆదేశాలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.
కానీ బీజేపీ మాత్రం టిడిపిని వైసీపీని సమదూరంలోనే పెడుతూ, టిడిపి స్థానాన్ని ఆక్రమించుకోవాలని చూస్తోంది.ఈ క్రమంలోనే ఆ పార్టీని బలహీనం చేసే విధంగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
మొదటి నుంచి సోము వీర్రాజు టిడిపి విషయంలో ఇదే తరహాలో వ్యవహరిస్తూ వచ్చేవారు.
ఇప్పుడు అంతకంటే తీవ్రస్థాయిలో టిడిపిని ఆయన టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు.
అలాగే బీజేపీలోనే ఉంటూ టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే నాయకులను కూడా పూర్తిగా పక్కన పెట్టేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టుగా కనిపిస్తున్నారు.ఏది ఏమైనా ఏపీలో బలపడేందుకు బీజేపీ చేస్తున్న ఈ ప్రయత్నాలు కాస్త వర్కౌట్ అయ్యేలాగే కనిపిస్తున్నాయి.
కాకపోతే బీజేపీ విమర్శలకు ప్రతి విమర్శలు చేయకపోవడంపై చంద్రబాబు తీరును సొంత పార్టీ నాయకులే తప్పుపడుతున్నారు.