పార్టీపైనే తిరుగుబావుటా ఎగురవేసిన నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాజకీయ భవిష్యత్తు డైలమాలో పడినట్లు కనిపిస్తోంది.ఆయన వ్యవహారం రెండిటికీ చెడ్డ రేవడిలా మారింది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సొంత పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ, అధినేత జగన్ ను ప్రశ్నిస్తూ, త్వరలోనే పార్టీ రద్దవుతుంది అంటూ హెచ్చరికలు కూడా చేశారు.ఢిల్లీ స్థాయిలో రాజకీయ పలుకుబడి ఉండటం, బిజెపి అగ్రనేతలు అంతా, తనకు మద్దతుగా నిలబడతారు అనే ధీమా కావచ్చు, రాజుగారి మాత్రం వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
ఆయన బీజేపీలో చేరేందుకే ఇలా వ్యాఖ్యానిస్తున్నారు అని వైసీపీ మొదట్లో ఆయన వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోలేదు.ఆయన చేస్తున్న విమర్శల తీవ్రత పెరిగి పోతుండటంతో ఒక్కసారిగా ఆయన వ్యవహారాన్ని అటో ఇటో తేల్చి చేయాలని వైసిపి డిసైడ్ అవడమే కాకుండా, వైసీపీ ఎంపీలు అందరిని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పంపించింది.
రఘురామకృష్ణరాజు పై వేటు పడే విధంగా జగన్ చక్రం తిప్పుతున్నట్టు తెలుస్తోంది.ఇక బీజేపీ కూడా రఘురామకృష్ణంరాజు ఒక్కడు కారణంగా, జగన్ ను దూరం చేసుకోవడం మంచిది కాదని, తమకు అవసరమైన ప్రతి సందర్భంలోనూ, జగన్ అండగా నిలబడుతున్నాడు అని, భవిష్యత్తులోనూ జగన్ అవసరం చాలా ఉంటుందనే అభిప్రాయంతో బీజేపీ కూడా వైసీపీ విషయంలో సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.రఘురామ కృష్ణం రాజు పై వేటు వేసే విషయంలో జగన్ సూచించినట్లుగా వ్యవహరిస్తేనే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.ఈ విషయాలన్నీ రఘురామకృష్ణరాజు కూడా సమాచారం అందడంతో కాస్త వెనక్కి తగ్గి వైసిపికి అనుకూలంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నా, ఆయన వ్యవహారాన్ని ఆషామాషీగా వదలకూడదు అని, ఖచ్చితంగా ఆయనపై అనర్హత వేటు వేయించి, పార్టీని దిక్కరిస్తే ఏమవుతుందో మిగతా వారికి సంకేతాలు ఇవ్వాలనే ఆలోచనతో ఆ పార్టీ ఉన్నట్లుగా కనిపిస్తోంది.
బిజెపి కూడా జగన్ కి మద్దతు ఇచ్చేలా కనిపిస్తోంది.ఇప్పటికే ఉభయ సభలు కేంద్రం ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు వైసీపీ మద్దతు ఇస్తోంది.
అలాగే కేంద్రం అడిగిన వెంటనే, అంబానీ సన్నిహితుడు పరిమళ్ నత్వానికి రాజ్యసభ సీటును వైసీపీ కట్టబెట్టింది.ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న కేంద్రం అనర్హత వేటు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.గతంలోనూ నితీష్ కుమార్ తో స్నేహం కోసం, శరద్ యాదవ్ పై కేంద్ర పెద్దలు ఇదేవిధంగా అనర్హత వేటు వేశారు.రాజుగారు విషయంలోనూ ఆ విధంగానే ముందుకు వెళ్లి వైసిపికి అనుకూలంగా వ్యవహరించాలనే నిర్ణయంతో కేంద్రం ఉండడంతో రఘురామకృష్ణంరాజు పై వేటు పడేలా కనిపిస్తుంది.
వైసీపీపై విమర్శలు చేసి బిజెపిలో చేరి ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పాలనుకున్న రఘురామకృష్ణంరాజు కు సొంత పార్టీలోనూ, వెళదామనుకుంటున్న పార్టీలోనూ ఎదురుదెబ్బ తగులుతున్నట్టుగా కనిపిస్తోంది.