రెండు తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలని ఎప్పటి నుంచో బీజేపీ కలలు కంటోంది.కానీ అవి సాకారం అవ్వడంలేదు.
ఎప్పటికప్పుడు బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే వస్తోంది.అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకుని బలపడాలని చూస్తున్నా, అది వర్కవుట్ కావడంలేదు.2023 నాటికి తెలంగాణలో, 2024 నాటికి ఏపీలోనూ అధికారాన్ని దక్కించుకునే విధంగా ముందుకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నాయి.అయితే రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీ గా ఉన్న వైసిపి టిఆర్ఎస్ ల విషయంలో బీజేపీ అనుసరిస్తున్న వైఖరి అనేక అనుమానాలకు తావిస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బీజేపీ సన్నిహితంగా మెలుగుతూ వచ్చినా, కొద్ది నెలలుగా తెలంగాణ లో టిఆర్ఎస్ పార్టీపై విమర్శలు తీవ్రస్థాయిలో చేస్తూ, అదే సమయంలో ఏపీ సీఎం జగన్ తోనూ సన్నిహితంగా మెలుగుతూ వస్తోంది.
ఇప్పుడు ఈ విషయం మరోసారి రుజువైంది.
గతంలో కేంద్ర బిల్లు ఆమోదానికి, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలలో బీజేపీ టిఆర్ఎస్ పార్టీ మద్దతు తీసుకుంది.ఈసారి టిఆర్ఎస్ ను దూరం పెట్టినట్టుగా కనిపిస్తోంది.
ఈనెల 14 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి.తొలిరోజునే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక కూడా నిర్వహించబోతున్నారు.
ప్రస్తుతం డిప్యూటీ చైర్మన్ గా ఉన్న జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ సింగ్ రాజ్యసభ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఆయననే మరోసారి అభ్యర్థిగా ఎన్డీయే నిలబెట్టింది.
ఎగువ సభలో తమకు పూర్తి మెజారిటీ లేకపోవడంతో, ఆయనకు మిగతా పార్టీల మద్దతు కూడగడుతోంది బీజేపీ కూటమి రాజ్యసభలో ఆరుగురు సభ్యుల బలం ఉన్న వైసీపీ మద్దతు కోరుతూ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇప్పటికే ఏపీ సీఎం జగన్ కు ఫోన్ చేశారు.రాజ్యసభ టిఆర్ఎస్ కు ఏడుగురు సభ్యులు ఉన్నారు.అంటే వైసీపీ కంటే ఎక్కువే.
అయినా ఇప్పటి వరకు ఎన్డీఏ కేసీఆర్ ను సంప్రదించకపోవడం చూస్తుంటే కేసీఆర్ మద్దతు తమకు అవసరం లేదనే సంకేతాలు ఇస్తున్నట్లు గా కనిపిస్తోంది.ఇవే కాకుండా, చాలా కాలం నుంచి బీజేపీ కేసీఆర్ ని దూరం పెడుతున్నట్టుగా వస్తోంది.
ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ టిఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీగా ఆధిపత్య పోరు పెరిగిపోతోంది.