కేంద్ర అధికార పార్టీ బిజెపి 2024 లో జరగబోయే ఎన్నికలపై సీరియస్ గానే దృష్టి పెట్టింది.ఇప్పటి వరకు తమతో కలిసే ఉన్న జనసేన పార్టీ ఎన్నికల సమయంలో తమకు దూరమై టిడిపితో జతకట్టే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.
ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాము బిజెపితో కలిసే ఉన్నామని, ఎన్నికలకు వారం ముందు పొత్తులపై క్లారిటీ వస్తుందని, బిజెపితో వెళ్తామో, లేక కొత్త పొత్తులతో వెళతామో అప్పుడే తేలుతుంది అంటూ మాట్లాడిన మాటలతో బిజెపి గందరగోళానికి గురవుతోంది.అయితే జనసేన మద్దతు ఉన్నా , లేకపోయినా ఏపీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు సంసిద్ధంగానే ఉంది.
ఈ మేరకు కేంద్ర బిజెపి పెద్దలు ఏపీ నాయకులకు హితబోధ చేశారు.అయితే 2019 ఎన్నికల్లో బిజెపి ఒంటరిగా పోటీ చేసింది.నోటా కంటే తక్కువ శాతం ఓట్లను సాధించింది.అయినా ఏపీలో అఖండ మెజారిటీతో గెలిచిన వైసీపీ బీజేపీతో పొత్తు ఉన్న పార్టీ మాదిరిగానే వ్యవహరిస్తోంది.కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులకు మద్దతు పలుకుతూ వస్తోంది.ఇక టిడిపి కూడా బిజెపిని ఎక్కడా విమర్శించే సాహసం చేయడం లేదు.
ఏపీ ప్రభుత్వం అన్ని విషయాల్లో కేంద్రం మద్దతు కోరుతోంది.ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కోసం, అవసరమైన నిధులను కేంద్రం సహకారంతోనే పొందుతోంది.
ఏపీలో బిజెపికి సీట్లు అధికారం రాకపోయినా , పెత్తనమంతా తమదే అన్నట్లుగా బిజెపి కేంద్రంలో హవా చూపిస్తోంది.ఇక ఎన్నికల సమయంలో జనసేన తమతో కలిసి వస్తే సరే, లేదంటే ఒంటరిగా వెళ్లినా తమకు వచ్చే నష్టం ఏమీ లేదన్న అభిప్రాయం బిజెపి అగ్ర నేతల్లో కనిపిస్తోంది.
ఇటీవల విడుదలైన ఇండియా టుడే సి ఓటర్ సర్వే లో బిజెపి కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వస్తుందనే నివేదికలు బయటకు రావడం బిజెపిలో మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుంది.అందుకే ఏపీలో సీట్లు, ఓట్లు రాకపోయినా తమకు వచ్చిన ఇబ్బందేమీ లేదనే లెక్కల్లో బిజెపి ఉంది.అందుకే ఏపీలో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమే అన్నట్లుగా సంకేతాలను పంపుతోంది.