ఏపీలో స్థానిక సంస్థలు ఎన్నికలు వాయిదా పడ్డాయి.మార్చి చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిచేయాలని సంకల్పంతో ఏపీ సీఎం జగన్ పూర్తి స్థాయిలో కసరత్తు చేశారు.
ఈ మేరకు అన్ని ఏర్పాట్లను చేశారు.మార్చి నెలాఖరు లోపు ఎన్నికలను పూర్తిచేస్తే కేంద్రం నుంచి 5 వేల కోట్ల నిధులు వచ్చే అవకాశం ఉండటంతో ఆ నిధులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని ఉద్దేశంతోనే ఇంతగా ఈ ఎన్నికలపై దృష్టి పెట్టారు.
కొన్నిచోట్ల ఏకగ్రీవంగా వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు.ఇక ఈ ఎన్నికల్లో వైసిపి క్లీన్ స్వీప్ చేస్తుందని భావించారు.
ప్రతిపక్షాలకు బలం లేకపోవడం, వైసీపీ దూకుడు ఇవన్నీ తమ కలిసొస్తాయని ఏపీ అధికార పార్టీ భావించగా, ఇప్పుడు కరోనా వైరస్ ను సాకుగా చూపించి కేంద్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసింది.
ఈ పరిణామాలతో ఒక్కసారిగా జగన్, ఆ పార్టీ నాయకులు ఆందోళనకు గురయ్యారు.
అసలు కేంద్రం ఎన్నికల సంఘం ఇంత ఆకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలు ఏంటో కూడా ఎవరికీ అంతుపట్టలేదు.అయితే ఈ ఎన్నికలు వాయిదా వేయడానికి కేంద్ర అధికార పార్టీ బిజెపి చక్రం తిప్పినట్లుగా కొన్ని సంకేతాల ద్వారా తెలుస్తోంది.
ఏపీలో అనేక చోట్ల ఏకగ్రీవాలు జరిగాయి.అయితే చాలా చోట్ల బలవంతంగా టిడిపి జనసేన బిజెపి అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా వైసిపి అడ్డుకోవడం, ఇవి మీడియాలోనూ ప్రచారం కావడంతో వైరల్ గా మారాయి.
ఇక మాచర్లలో అయితే బీజేపీ అభ్యర్థులను కూడా తరిమి కొట్టడం తో ఏపీ బీజేపీ నాయకులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు.
కేంద్ర అధికార పార్టీ బీజేపీ విషయంలో వైసీపీ ఈ విధంగా వ్యవహరించడం పై కేంద్రం పెద్దలు కూడా ఆగ్రహం చెందారు.దీంతో ఏపీలో ఎన్నికల వాయిదా వేసే విధంగా చక్రం తిప్పినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.అయితే ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం తీరును ఏపీలో విపక్ష పార్టీలను విమర్శిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో బిజెపి జోక్యం ఉందని తెలిసిన ఆ పార్టీని విమర్శించేందుకు సాహసం చేయలేకపోతోంది.
ఇప్పుడు ఎన్నికలు వాయిదా పడడం ద్వారా కేంద్రం నుంచి వచ్చే ఐదువేల కోట్లను ఏపీ ప్రభుత్వం కోల్పోయే పరిస్థితి రావడంతో ఆ నిధులను నమ్ముకుని అనేక సంక్షేమ పథకాలను అమలు చేయాలని చూసిన జగన్ కు ఇప్పుడు ఎన్నికల వాయిదా పడడం మింగుడుపడని అంశంగా మారింది.