కేంద్రంలో మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వస్తుందని దాదాపు మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ తమ ఫలితాలను వెల్లడించాయి.దీంతో మరోసారి మోదీ ప్రభుత్వం కొలువుతీరడం ఖాయం అయిపోయినట్టే అని అంత భావిస్తున్నారు.
కాకపోతే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 273.అయితే ఆ విషయంలో బీజేపీలో ఎక్కడలేని ధీమా కనిపిస్తోంది.తమకు ఒక్క ఉత్తర ప్రదేశ్లోనే 74కు పైగా సీట్లు వస్తాయని, తాము ఒంటరిగానే 300కు పైగా సీట్లు గెలుస్తామని ఆ పార్టీ అగ్రనాయకులు చెబుతున్నారు.దీనికి తోడు దేశంలో ఎక్కువ లోక్సభ స్థానాలు బీజేపీకే వస్తాయని లెక్కలు చెబుతున్నా అదే సమయంలో విపక్షాల బలం కూడా ఈసారి పెరుగుతుందని వెల్లడించాయి.
గత ఎన్నికల్లో సాధించిన సీట్లు ఈసారి బీజేపీకి దక్కే అవకాశం కనిపించడంలేదు.ఎందుకంటే గతంలో ఆ పార్టీకి మిత్రపక్షంగా ఉండి ఎన్నికల్లో పోటీ చేసిన చాలామంది ఈ ఎన్నికల సమయంలో దూరం అయ్యారు.
అయితే కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలైన కొన్ని ప్రాంతీయ పార్టీలు ఒక మాట మీదకు వచ్చి మోదీకి అడ్డంకులు సృష్టించే ప్రమాదం కూడా కనిపిస్తోంది.ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలని, అందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ఎన్డీయే వైపు ఉండేలా చూసుకోవాలనేది నరేంద్ర మోదీ, అమిత్ షాల ఆలోచన.
ఈ నేపథ్యంలో యూపీఏ భాగస్వాములపై బీజేపీ కన్నువేసింది.ఏదో ఒకరకంగా ఆ పార్టీలను యూపీఏకు దూరం చేసి, తమతో కలుపుకుని అధికార పీఠాన్ని పటిష్టం చేసుకోవాలని చూస్తోంది.
ఇక ఏపీ, తెలంగాణ విషయానికి వస్తే మొదటి నుంచి ఆ రెండు రాష్ట్రాల మీద బీజేపీ కన్ను వేసింది.తెలంగాణాలో టీఆర్ఎస్, ఏపీలో వైసీపీ జోరు మీద ఉండడంతో ఆ రెండు పార్టీల మద్దతు తమకే ఉంటుందని బీజేపీ భావిస్తోంది.అందుకే ఇటు సీఎం కేసీఆర్తో, అటు వైఎస్ జగన్తో స్నేహంగా మెలుగుతూ తమకే మద్దతు ఇవ్వాలంటూ సంకేతాలు పంపుతున్నారు.కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సీట్లు బీజేపీకి రాకపోతే జగన్ , కేసీఆర్ పార్టల మద్దతు బీజేపీకి చాలా అవసరం అవుతుంది.
అందుకే ఆ రెండు పార్టీల మద్దతు తమకే ఉండేలా బీజేపీ ఎత్తులు వేస్తోంది.ఇక జగన్, కేసీఆర్ కూడా పైకి ఎన్ని మాటలు చెబుతున్నా ఆ సమయం వచ్చేసరికి బీజేపీకే మద్దతు ప్రకటించేలా వారి వ్యవహారం కనిపిస్తోంది.