గ్రేటర్ ఎన్నికల్లో ఆ మాత్రం ఓట్లు, సీట్లు రాబట్టకునేందుకు బీజేపీ ఎన్నో ఎత్తులు, జిత్తులు వేసింది.ముస్లింల ఓట్లు పడకపోయినా హిందువల ఓట్లు గంపగుత్తగా పడతాయని ఎన్నో ఎత్తులు, స్కెచ్లు వేసింది.
తాము అనుకున్న విషయంలో కొంత వరకు బీజేపీ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి.ఆ పార్టీ హిందూత్వ వాదం చాలా వరకు సక్సెస్ అయ్యింది.
అయితే హైదరాబాద్ వేరు.ఆ నగరానికి ఉన్న చారిత్రక ప్రాశస్త్యం వేరు.
ఏపీలో ఆ పరిస్థితి ఉందా ? అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి.
ఇప్పుడు ఏపీలోనూ అదే ఫార్ములాతో తిరుపతి ఉప ఎన్నికల్లో సక్సెస్ కావాలని బీజేపీ ఎన్నో గేమ్స్ ఆడుతోంది.
అయితే తిరుపతి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ కూడా రాకుండానే బీజేపీ చేస్తోన్న ఓవర్ యాక్షన్ మాత్రం ఇప్పటికే ఆ పార్టీపై ఉన్న వ్యతిరేకతకు మరింత ఆజ్యం పోసేలా ఉంది.అక్కడ బీజేపీ ఓవర్ యాక్షన్తో ముందే సెల్ఫ్ గోల్ వేసుకోబోతోందా ? అన్న సందేహాలు కూడా వస్తున్నాయి.
ఏపీలో కూడా సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని ఇప్పటికే బీజేపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారు.కానీ అమరావతి, పోలవరం విషయంలో ఏపీ ప్రజలు బీజేపీ చేసిన మోసంతో ఆ పార్టీపై తీవ్రంగా రగులుతున్నారు.ఇక పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఏపీలో జరుగుతోన్న పెద్ద ఎన్నిక కావడంతో బీజేపీ సత్తా ఏంటో ఈ ఎన్నికతోనే తేలిపోనుంది.ఆ పార్టీ జనసేనతో జోడీ కట్టి బరిలో ఉంది.
అసలు గెలుపు సంగతి పక్కన పెడితే తిరుపతిలో బీజేపీ డిపాజిట్ అయినా తెచ్చుకుంటుందా ? అన్నదే ఇప్పుడు సస్పెన్స్.ఆ పార్టీకి అంతకు మించి ఇక్కడ ఆశించడానికేం లేదన్నది కూడా వాస్తవమే.
హిందు దేవాలయాలకు నిధులు ఇవ్వాలి, దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలనడం వరకు బీజేపీకి ప్లస్సే అయినా దర్గాలకు, చర్చిలకు నిధులు ఇస్తే మాత్రం బీజేపీ కడుపు మంటతో రగిలిపోవడం చాలా వర్గాలకు మింగుడు పడడం లేదు.ఏదేమైనా బీజేపీ మితిమీరి హిందూత్వ అజెండాతో ముందుకు వెళితే బొక్క బోర్లా పడక తప్పదు.