చెప్పుకోవడానికి కేంద్ర అధికార పార్టీ అనే పలుకుబడి ఉన్నా, ఏపీలో బీజేపీ పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఎప్పటి నుంచో ఏపీలో పాగా వేయాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నా, అది సాధ్యం కావడం లేదు.
ఎప్పుడూ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే కానీ 1,2 సీట్లు సాధించలేని స్థితిలో ఆ పార్టీ ఉంది.ఈ నేపథ్యంలో ఏపీలో అధికారపీఠం దక్కించుకోవాలనే ఆశలు బిజెపికి అడియాసలుగానే మారుతూ వస్తున్నాయి.
గతంలో టిడిపితో కలిసి పొత్తు పెట్టుకున్నా బిజెపి కొన్ని సీట్లను టీడీపీ సహకారంతో గెలుచుకుంది.ఇక బిజెపి-టిడిపి పొత్తు విజయవంతంగా సాగుతుంది అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా చంద్రబాబు బిజెపి కి ఝలక్ ఇస్తూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ తెగతెంపులు చేసుకున్నారు.
ఈ వ్యవహారం అప్పట్లో బిజెపికి తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది.అదే కసితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాలా సహకరిస్తూ టిడిపిని ఓడించడమే లక్ష్యంగా, వైసీపీకి పరోక్షంగా సహకరిస్తూ వైసిపి విజయానికి కృషి చేసింది.
ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ కేంద్ర బీజేపీ పెద్దలు వ్యవహరించారు.అదే సమయంలో ఏపీ బీజేపీ నేతలు వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ, తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రజా ఉద్యమాలు ఆందోళనలు చేపట్టారు.
దీంతో బీజేపీ నాయకులపై వ్యవహారశైలిపై గందరగోళం నెలకొంది.ఈ విషయాల పైన సీరియస్ గా దృష్టి పెట్టిన బిజెపి అధిష్టానం ఏదో ఒక పార్టీకి మద్దతు ఇస్తూ వెళ్లడమే తప్ప, ఏపీలో అధికారం దక్కించుకోవాలంటే టిడిపి వైసిపిలను టార్గెట్ చేసుకుని ముందుకు వెళ్లకపోతే, ఎప్పటికీ ఇలాగే ఉండాల్సి వస్తుందని అనే అభిప్రాయంతో ఇప్పుడు టిడిపి, వైసిపి నాయకులకు ఎర వేస్తున్నట్లు తెలుస్తోంది.
భారీ ఎత్తున నాయకులను బిజెపిలో చేర్చుకుని వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలని బిజెపి ప్లాన్ చేస్తోంది.ప్రస్తుతం నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ను బిజెపి చెరదేస్తున్నట్టు గా కనిపిస్తోంది.
ఇదే కాకుండా మరికొంత మంది నాయకులను క్రమక్రమంగా వైసీపీకి దూరం చేయాలని, ఇరు పార్టీల్లోని కీలక నాయకులందరినీ బిజెపి లో చేర్చుకొని ఏపీలో బలమైన పార్టీగా తయారవ్వాలని చూస్తోంది.ప్రస్తుతం టిడిపిని టార్గెట్ చేసుకుంటూ వైసిపి ముందుకు వెళ్తున్న తీరును బిజెపి జాగ్రత్తగా పరిశీలిస్తోంది.
టిడిపి, వైసీపీలను బలహీనం చేస్తే, ఆ స్థానం తమకు దక్కుతుందని, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం పై పెద్ద ఎత్తున ఉద్యమాలు, ఆందోళనలు చేస్తూ 2024 నాటికి అధికారం దక్కించుకోవాలని చూస్తోంది.జనసేన పార్టీ మద్దతుతో తమ లక్ష్యం నెరవేరుతుంది అనే అభిప్రాయంలో బీజేపీ ఉన్నట్టుగా కనిపిస్తోంది.