అప్పట్లో రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి సొంతంగా పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేసినా అధికారం దక్కించుకోలేకపోయారు.అయితే ఓటింగ్ శాతం మాత్రం ఆ పార్టీకి చెప్పుకోదగిన స్థాయిలో వచ్చింది.
ఆ తరువాత చిరు పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం, కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగిపోయాయి.అయితే ప్రస్తుతం చిరు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
తన సొంత తమ్ముడు జనసేన పేరుతో పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేసినా చిరు మాత్రం ఎక్కడా ప్రచారానికి కూడా దిగలేదు సరికదా అసలు ఏ రాజకీయ పార్టీలతో తనకు సంబంధమే లేదన్నట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నారు.అయితే ప్రస్తుతం ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీ అందుకు తగిన ఇమేజ్ ఉన్న నాయకుడి కోసం ఎదురుచూస్తోంది.
ఈ దశలో బీజేపీ చూపు చిరంజీవి మీద పడినట్టు కనిపిస్తోంది.ఇప్పటికే చిరంజీవిని బీజేపీలోకి రావాల్సిందిగా అనేకసార్లు ఆహ్వానాలు కూడా పంపారు.
అయితే మరోసారి రాజకీయాల్లోకి వచ్చేందుకు చిరు ససేమీరా అనడంతో ఆయన్ను ఒప్పించేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది.ఆ మేరకు ఆయనకు పార్టీలో క్రియాశీలక పాత్ర కట్టబెడతామని కూడా వర్తమానాలు పంపుతోంది.అంతే కాదు చిరంజీవిని 2024 ఆంధ్రప్రదేశ్ సీఎం అభ్యర్థి అని కూడా ప్రకటించేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు ఇచ్చిందట.అయితే చిరు మాత్రం బీజేపీలోకి వచ్చే ఆలోచన చెయ్యట్లేదు.
ఎలాగూ ఆంధ్రాలో బీజేపీ గెలవదు కదా ఇప్పుడు తాను ఆ పార్టీలో చేరినా పెద్ద ఉపయోగం ఏమి ఉంటుంది అనే ఆలోచనలో చిరు ఉన్నాడట.ప్రస్తుతం ఆంధ్ర పరిస్థితులు వేరుగా ఉన్నాయని భావిస్తున్నాడట.
కులం కార్డు సరిగ్గా ఉపయోగిస్తే చాలు కానీ ఇప్పటికే చిరు ఆ కార్డును ఉపయోగించుకున్నాడు.మళ్లీ ఆ కార్డు ఉపయోగించుకోవాలన్నా అవకాశం లేదని చిరు నమ్ముతున్నాడట.
పైగా ఈ ఎన్నికల్లో జనసేన కేవలం ఒక్క సీటుకే పరిమితం అవ్వడం కూడా చిరు పొలిటికల్ ఎంట్రీ కి బ్రేకులు వేస్తోందట.
చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోయినా ఆయనను వదలడంలేదట.చిరుకి ఉన్న మెగా ఇమేజ్ ని ఎలా అయినా బీజేపీకి డైవర్ట్ చేయాలని బీజేపీ చూస్తోంది.చిరు బీజేపీలో చేరితే ఏపీలో మెజార్టీ ఓటర్లుగా ఉన్న ‘కాపు’ కులం బీజేపీకి అండగా నిలబడుతుందని, తద్వారా భారీగా లబ్ది పొందవచ్చని బీజేపీ ప్లాన్.
దీనిలో భాగంగానే ఇప్పటికే కొన్ని చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తుంది.ప్రస్తుతం టీడీపీలో ఉన్నా లేనట్టుగానే ఉన్నమాజీ మంత్రి, ప్రస్తుత శాసన సభ్యుడు గంటా శ్రీనివాసరావు వంటి కొంతమంది కాపు నేతలు బీజేపీతో టచ్ లో ఉన్నారట.
ప్రస్తుతం ఆయన ద్వారానే చిరంజీవిని బీజేపీలోకి తీసుకురావాలని బీజేపీ ప్లాన్ చేస్తోందట.గతంలోనే గంటా బీజేపీలోకి చేరబోతున్నాడనే వార్తలు వచ్చాయి.ఇప్పుడు చిరంజీవి గాని బీజేపీలోకి వెళితే గంటా ఆయన్ను అనుసరించే ఛాన్స్ ఉంది.కాకపోతే ఈ విషయంలో చిరు ఏ విధంగా స్టెప్ తీసుకుంటాడో అనేదే తేలాల్సి ఉంది.