దేశవ్యాప్తంగా కేంద్ర అధికార పార్టీ బిజెపి గ్రాఫ్ పడిపోతోంది అనుకుంటున్న సమయంలో, ఒక్కో రాష్ట్రంలో పట్టు పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది.ఊహించని విజయాలతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
ఉత్తరాదిలో పట్టు పెంచుకోవడంతో పాటు , దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటకలో రెండు సీట్లను సొంతం చేసుకోగలిగింది.తాజాగా దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం తథ్యం అనుకున్న సమయంలో అకస్మాత్తుగా బిజెపి బలం పుంజుకుని, ఏకంగా అధికార పార్టీ టిఆర్ఎస్ కు సవాల్ విసిరి మరీ విజయాన్ని అందుకుంది.
దీంతో ఇప్పుడు బిజెపి బలం బాగా పెరిగిపోతున్నట్టు గా కనిపిస్తోంది.పెద్ద ఎత్తున నాయకులు ఆ పార్టీలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.దీంతో బీజేపీ లో ఎక్కడ లేని ఉత్సాహం కలుగుతుంది.రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగుర వేయడం ఖాయమనే అభిప్రాయం లో ఆ పార్టీ అగ్రనేతలు ఉన్నారు.
ఇది ఇలా ఉంటే , తెలంగాణతో పాటు ఇప్పుడు ఏపీ పైనా, పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేందుకు బిజెపి పెద్దలు సిద్ధమవుతున్నారు.
గతంతో పోలిస్తే ఏపీలోనూ కాస్తోకూస్తో జగ్రత్తగా అడుగులు వేస్తే, ఇక్కడ బలపడడం అంత కష్టమేమీ కాదు అనే అభిప్రాయాలు ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి.
ఎలాగూ జనసేన సహకారం ఉంటుంది కాబట్టి, జాగ్రత్తగా బలం పెంచుకోగలిగితే బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో తిరుగు ఉండదు అనేది ఆ పార్టీ అభిప్రాయం గా కనిపిస్తోంది.ఇది ఇలా ఉంటే, త్వరలోనే తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఇక్కడ ఎంపీగా గెలిచిన బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో ఇక్కడ ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి.దీంతో ఈ స్థానం పై బిజెపి పెద్దలు కన్నేసినట్టు గా కనిపిస్తున్నారు ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుపతిలో బిజెపికి గట్టి పట్టు ఉండడంతో, ఇక్కడ విజయం తమకే దక్కుతుందనే అంచనాలో ఆ పార్టీ ఉంది.
దీనికి తోడు ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకుని మరింతగా బలపడాలని, మోహమాటాలన్ని పక్కనపెట్టి, వైసీపీ ప్రభుత్వం పైన పోరాటాలు చేయాలని , అలాగే దుబ్బాక ఉప ఎన్నికలలో బిజెపి గెలుపు కోసం ఏ స్ట్రాటజీ తో అయితే ముందుకు వెళ్లారో అదే స్ట్రాటజీ ఉపయోగించి, ఇక్కడ విజయాన్ని అందుకోవాలని తహతహలాడుతున్నట్టుగా కనిపిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పూర్తి స్థాయిలో ఈ వ్యవహారంపై దృష్టి పెట్టినట్లు సమాచారం.
ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును నియమించడంతో ఆయనకు మరిన్ని అధికారాలను కట్టబెట్టి, పార్టీని ఒక గాడిలో పెట్టాలని , వలసలను ప్రోత్సహించే విధంగా చేయాలని తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉండడతో ఆ పార్టీని మరింత బలహీనం చేసి, ఆ పార్టీకి వెళ్ళే ఓట్లను, ఆ పార్టీలోని నాయకులను చేర్చుకుని విజయాన్ని బిజెపి ఖాతాలో వేసుకోవాలనే ప్లాన్ తో ముందుకు వెళుతున్నట్లుగా కనిపిస్తోంది.అయితే ఈ పరిణామాలన్నీ ఏపీ అధికార పార్టీ వైసీపీ కి కాస్త ఆందోళన కలిగిస్తున్నాయట.
రెండు పార్టీలు అనధికారికంగా పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తున్న క్రమంలో, ఈ విధంగా బీజేపీ వైఖరి మారుతుందని వైసిపి ఊహించలేదు.