గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ స్థానాన్ని సంపాదించడమే ఏకైక లక్ష్యంగా బిజెపి అడుగులు వేస్తోంది.గతంతో పోలిస్తే, బిజెపి తెలంగాణ లో బాగా బలపడినట్టుగా కనిపిస్తోంది.
ఎలాగూ కాంగ్రెస్ బలహీనం కావడంతో, బిజెపికి ఈ పరిణామాలన్నీ కలిసి వస్తున్నాయి.దీనికి తోడు టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నట్లుగా అనేక సంకేతాలు వస్తుండడం, దుబ్బాక ఉపఎన్నికల్లో టిఆర్ఎస్, బిజెపి ఈ రెండు పార్టీలు నువ్వానేనా అన్నట్లు గా పోటీ పడడం, గెలుపుపై టిఆర్ఎస్ కు సందేహాలు మొదలవడం వంటి పరిణామాలతో, బిజెపి వైపు జనాలు మొగ్గు చూపుతున్నట్టుగా, ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది.
ఏదో రకంగా గ్రేటర్ లో పట్టు సాధించడం ద్వారా, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి అధికారం దక్కుతుంది అనే సంకేతాలను ఇవ్వొచ్చు అని ఆ పార్టీ నాయకులు బలంగా నమ్ముతున్నారు.అందుకే ఆపరేషన్ అకర్ష్ కు తెర తీసినట్టుగా కనిపిస్తున్నారు.
టిఆర్ఎస్ పార్టీలో ఉన్న అసంతృప్తి నాయకులను, మాజీ ఎమ్మెల్యేలు , మాజీ మంత్రుల పైన దృష్టి సారించి, వారిని దగ్గర చేర్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది .దీంతో పాటు సినిమా రంగానికి చెందిన వారిని పెద్ద ఎత్తున చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది .
ఇదిలా ఉంటే, గతంలో హైదరాబాద్ మేయర్ గా పనిచేసిన మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి పై బిజెపి ఇప్పుడు దృష్టిసారించింది .ఆయన గత కొంత కాలంగా టిఆర్ఎస్ అధిష్టానంపై అసంతృప్తితో ఉండడం, కాంగ్రెస్ నుంచి ఇదే నియోజకవర్గం నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డి టిఆర్ఎస్ లో చేరడం , ఆమెకు ఆ పార్టీ అధిష్టానం ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వడం, అలాగే మంత్రి పదవిని సైతం కట్టబెట్టడం వంటి పరిణామాలు తీగలకు అసంతృప్తిని కలుగ చేస్తోందట.అందుకే ఆయన అసంతృప్తితో ఉండడాన్ని గుర్తించిన బిజెపి నేతలు ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట.ఆయన పార్టీలో చేరితే మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తాము అనే ఆఫర్ కూడా ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక తీగల కృష్ణారెడ్డి సైతం బిజెపిలో చేరికపై సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.