అధికారంలో ఉండగా వెనుకా ముందు చూడకుండా చెలరేగిపోతే అధికారం పోయాక పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు కొంతమంది టీడీపీ నేతలకు బాగా తెలిసొస్తోంది.పార్టీ అధికారంలో లేకపోవడమో, కేసుల భయమో తెలియదు కానీ చాలామంది టీడీపీ నేతలు కేంద్ర అధికార పార్టీ బీజేపీ వైపు అడుగులు వేస్తూ సేఫ్ పొజిషన్ లోకి వెళ్లిపోతున్నారు.
అయితే ఇదంతా కొందరి విషయంలోనే ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని పార్టీల నుంచి వచ్చిన వారిని వచ్చినట్టు చేర్చుకుంటున్న బీజేపీ కొంతమంది టీడీపీ నాయకులను చేర్చుకునే విషయంలో నో ఎంట్రీ బోర్డు పెట్టేసిందట.ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులతో పాటు ఓ ఎమ్మెల్సీ బిజెపిలోకి చేరిపోయారు.
ఇక ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్చార్జిలు, మాజీ ఎంపీలు రేపో మాపో పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.
తెలుగుదేశాన్ని బలహీనం చేయడమే తమ ప్రధాన అజెండగా ముందుకు వెళ్తున్న బీజేపీ ఆ పార్టీ నుంచి ఎంత మంది నాయకులు తమ పార్టీలోకి వచ్చినా చేర్చుకుంటాం అని చెబుతూనే కొంతమంది విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారట.ముఖ్యంగా ఓ ఐదుగురు నేతల విషయంలో మాత్రం నో చెబుతున్నారట.ఇంతకు టీడీపీకి చెందిన ఏ నేతలను బీజేపీ వద్దనడానికి కారణం ఏంటి అని విశ్లేషిస్తే చాలా విషయాలే బయటపడుతున్నాయి.
తాజా ఎన్నికల్లో ఓటమి చెందిన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మాజీ ఎంపీలు జెసి దివాకర్ రెడ్డి, రాయపాటి సాంబశివరావు ఈ నేతలు ఐదుగురు ఎన్నికల్లో ఓడిపోయినా టిడిపి అధికారంలో ఉండగా తమ సొంత జిల్లాలో తమ నియోజక వర్గాల్లో పట్టు ఉన్నవారే.
అయితే ఈ ఐదుగురు నేతలు ఆయా నియాజకవర్గాల్లో ఒంటెద్దు పోకడలు పోవడం, ఫలితంగా పార్టీ నిందలు మోయడం ఇవన్నీ బీజేపీని ఆలోచనలో పడేశాయట.ఇటువంటి మరకలు ఉన్నవారిని పార్టీలో చేర్చుకుంటే ఆ అవినీతి మరక మొత్తం బిజెపికే అంటుకుంటుందని కొంతమంది ఏపీ నేతలు అధిష్టానం దగ్గర పంచాయతీ పెట్టడంతో వీరి ఎంట్రీకి బ్రేక్ పడిందట.చింతమనేని ప్రభాకర్ ఎటువంటి వివాస్పద నాయకుడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మంత్రిగా ఉన్నప్పుడు తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు.మాజీ ఎంపీలు జేసీ దివాకర్ రెడ్డి, రాయపాటి సాంబశివరావు, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు వంటి వారిని పార్టీలో చేర్చుకోవడం వల్ల అనవసర తలనొప్పులు తప్ప పెద్దగా పార్టీకి ప్రయోజనం ఉండదని బీజేపీ భావిస్తోందట.