జీహెచ్ఎంసీ ఎన్నికల వాతావరణంతో హైదరాబాద్ రాజకీయం వేడెక్కింది.నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
పార్టీల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.పోలింగ్కు సమయం దగ్గరపడుతుండటంతో నేతలు తమ స్వరాన్ని పెంచేశారు.హైదరాబాద్ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు టీఆర్ఎస్-బీజేపీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.2016 ఎన్నికల విజయాన్ని మరొకసారి రిపీట్ చేయాలని టీఆర్ఎస్ భావిస్తుంటే మరోపక్క ఈ సారి మేయర్ పీఠంపై కాషాయ జెండాను ఎలాగైనా ఎగురవేయాలని కమలదళం తహతహలాడుతోంది.
మేయర్ పీఠంపై బీజేపీ ఈసారి తమ గురిని గట్టిగానే పెట్టింది.ఈనేపథ్యంలోనే హైదరాబాద్ మేయర్ పీఠం కోసం రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఏకంగా జాతీయ నాయకత్వాన్ని రంగంలోకి దింపుతోంది.
దుబ్బాక విజయాన్ని గ్రేటర్లోనూ కంటిన్యూ చేయాలని ఉవ్వీళ్లూరుతోంది.దీనికోసం జాతీయ నాయకులతో జీహెచ్ఎంసీ ఎన్నికల కమిటీని ఇప్పటికే వేసింది.
అందులో బీహార్ బీజేపీ నేత, కేంద్రమంత్రి అమిత్షా సన్నిహితుడు భూపేంద్ర యాదవ్ ఇంఛార్జీగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.అంతే కాకుండా కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, బీహార్, మధ్యప్రదేశ్, ఇతర రాష్ట్రాల నేతలతోపాటు తెలంగాణ నేతలనూ ఆ కమిటీలో చోటుకల్పించింది.
ఈ కమిటీ గ్రేటర్లో ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూ దూసుకుపోతుంది.మరోవైపు బీజేవైఎం జాతీయ అధ్యక్షులు, బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యను కూడా రంగంలోకి దింపి సికింద్రాబాద్లో ఛేంజ్ హైదరాబాద్ పేరుతో సభను నిర్వహించారు.
అలాగే ఉస్మానియా యూనివర్శిటీలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి విద్యార్థి ఓట్లను దండుకునేందుకు ముమ్మర ప్రయత్నాలను బీజేపీ చేసింది.
రోజుకొక్క జాతీయ స్థాయి నేతలు ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్కు వస్తున్నారు.ఈ రోజు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరానికి వచ్చి మీడియా సమావేశంలో పాల్గొన్నారు.బండి సంజయ్ చేసిన సర్జికల్ స్ట్రైక్ వ్యాఖ్యలను సమర్ధించే ప్రయత్నం కూడా చేశారు.
గ్రేటర్ ఎన్నికలకు డిసెంబర్ 1న పోలింగ్ జరగనుంది.ఈ పోలింగ్ తేదీకి రెండు మూడు రోజుల ముందు అమిత్షాను, జేపీ నడ్డాను, యోగి ఆదిత్యానాథ్ను సైతం ఎన్నికల ప్రచారానికి హైదరాబాద్కు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయంపై ఇప్పటికే జాతీయ నాయకత్వంతో కూడా ఇక్కడి నేతలు మాట్లాడినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ దూకుడును ప్రదర్శించి మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు పోతుంది.
అందుకోసమే జాతీయ నాయకత్వన్నిగ్రేటర్ ఎన్నికల కోసం రంగంలోకి దింపుతుందని రాజాకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.