తెలంగాణ బీజేపీ లో మంచి ఊపు కనిపిస్తోంది.ఏదో విధంగా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నాయకుల్లో నమ్మకం బాగా పెరిగింది.
ఇటీవల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రతి విషయంలోనూ పైచేయి సాధిస్తూ వస్తుండడం, దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీకి టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత పెరగడం ఇవన్నీ తెలంగాణ బీజేపీ నాయకుల్లో మరింత ఉత్సాహం కలిగిస్తోంది.దీంతో రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ సీట్ల పై అందరి కన్ను పడింది.
ఎలాగు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభావం అంతంత మాత్రంగా ఉండడంతో, తమ గెలుపునకు ఎటువంటి డోకా ఉండదని బీజేపీ నాయకులు నమ్ముతున్నారు.
ముఖ్యంగా ప్రస్తుత సిట్టింగ్ ఎంపీలంతా రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ కి పోటీ చేయాలని ఉత్సాహపడుతున్నారు.
ఈ మేరకు ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంలో ఒక క్లారిటీ కి వచ్చేసారు.దీనికి సంబంధించిన ప్రకటనలు కూడా చేస్తుండడం చూస్తుంటే , వచ్చే ఎన్నికల సమయం లో తాము పోటీ చేద్దాం అనుకున్న స్థానం నుంచి పార్టీలోని ఇతర నాయకులు పోటీకి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు గా కనిపిస్తున్నారు.
నిజామాబాద్ ఎంపీ అరవింద్ విషయానికి వస్తే, ఆయన ఆర్మూర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు.ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు కూడా ఆయనకు బాగా కలిసి వచ్చాయి.
ఆర్మూర్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో అరవింద్ పై దాడి జరిగింది.ఈ సందర్భంగా తాను ఆర్మూర్ నుంచి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని ,డిపాజిట్ కూడా దక్కకుండా జీవన్ రెడ్డిని ఓడిస్తా అంటూ అరవింద్ శపథం చేశారు.
ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాబోయే ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు.
గతంలో చాలా సార్లు ఆయన అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి చెందారు.అయితే ఎంపీగా కరీంనగర్ నుంచి పోటీ చేసి గెలిచారు.ఆ ఎన్నికల్లో వేములవాడ నుంచి సంజయ్ కు ఎక్కువ మెజారిటీ రావడంతో, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ నుంచి పోటీ చేస్తే సునాయాసంగా గెలుస్తాను అనే నమ్మకంతో ఉన్నారు.
అందుకే తరచుగా ఆయన వేములవాడ నియోజకవర్గం లో ఎక్కువగా పర్యటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విషయానికొస్తే ఆయన వరుసగా ఎమ్మెల్యే గా గెలుస్తూ వచ్చారు.కానీ 2018లో ఎమ్మెల్యేగా ఓటమి చెందడంతో ఆ తరువాత ఎంపీగా పోటీ చేసి గెలిచారు.2023 ఎన్నికల్లో మాత్రం మళ్లీ అంబర్ పేట నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచేందుకు ఆయన తగిన ప్రణాళికలు రచిస్తున్నారు.ఆదిలాబాద్ బీజేపీ ఎంపి సోయం బాబూరావు సైతం రాబోయే ఎన్నికల్లో ఆసిఫాబాద్ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని చూస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఆదివాసీలు ఎక్కువగా ఉండడంతో సునాయాసంగా గెలుస్తాననే అంచనా లో ఉన్నారు.
ఈ విధంగా ఎవరికి వారే ముందుగానే అసెంబ్లీ టికెట్లను ఖరారు చేసుకుంటూ, ఎన్నికల సమయంలో తమకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు.