ఏపీ లోని అంతర్వేదిలో రథం దగ్ధమైన సంఘటన దగ్గర నుంచి బీజేపీ వైసీపీ మధ్య వివాదం తారస్థాయికి చేరింది.ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించుకుంటూ హడావుడి చేస్తున్నారు.
అంతర్వేది ఘటన మాత్రమే కాకుండా, విజయవాడ దుర్గమ్మ ఆలయంలో వెండి రథానికి చెందిన సింహాలు మాయమవడంపైనా, పెద్ద దుమారమే చెలరేగుతోంది.ఈ దేవాలయాల అంశానికి సంబంధించి వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు.
ఈరోజు పిలుపు ఇచ్చిన చలో అమలాపురం కూడా ఉద్రిక్తంగా మారింది.బీజేపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే ఈ దేవాలయాల వ్యవహారంలో జోక్యం చేసుకోవాలంటూ బీజేపీ ఎంపీలు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ మేరకు జీవీఎల్ నరసింహారావు సీఎం రమేష్ తదితరులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను పార్లమెంట్ లో కలిసి ఆయనకు ఫిర్యాదు చేశారు. అంతర్వేది లో 62 ఏళ్ల చరిత్ర కలిగిన రథం దగ్ధం చేయడం, విజయవాడ కనకదుర్గమ్మ గుడి లో అమ్మవారి రథంపై వెండి సింహాలు మాయం అవ్వడం, ఈ ఏడాదిలో సుమారు 18 ఘటనలు ఈ విధంగా జరిగాయని, దీని కారణంగా రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి అని, తక్షణమే ఈ వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.అంతేకాదు హిందువుల మనోభావాల విషయంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటుందని, ఇదే అంతర్వేది లో చర్చి పై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లువిసిరిన సంఘటనపై మాత్రం హడావిడిగా చర్యలు తీసుకుందని , అంతర్వేది చర్చి రాళ్లువిసిరిన వ్యవహారంలో 41 మంది హిందూ సంఘాల కార్యకర్తలపై కేసులు నమోదు చేశారని , వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపించారని, కానీ హిందూ దేవాలయాల విషయంలో ఆ స్పీడ్ లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎంపీలు అమిత్ షా కు ఫిర్యాదు చేశారు.
ఇదే కాదు గుంటూరు పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన ముస్లింలు పై కేసులను ప్రభుత్వం ఉప ఉపసంహరించుకుంది అనే విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఇప్పటివరకు ఏపీ రాజకీయాలపై సైలెంట్ గా ఉంటూ వచ్చిన చంద్రబాబు సన్నిహితుడు గా పేరు పొందిన బిజెపి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మళ్లీ ఈ వ్యవహారంతో తెరపైకి వచ్చారు.ఏదో ఒకరకంగా కేంద్ర పెద్దలను ఒప్పించి జగన్ ప్రభుత్వం దూకుడుకు బ్రేక్ వేయాలని చూస్తున్నారు.