బిజెపి నాయకుడు రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి రాజధాని వ్యవహారంపై జగన్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు.ఏపీ రాజధాని మార్చుతాను అంటూ జగన్ మొండి పట్టుదలతో ముందుకు వెళ్తున్నారని, కానీ రాజధాని మార్పు పై హైకోర్ట్ కి వెళ్తే వైసీపీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని సుజనాచౌదరి చెప్పారు.
ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన రాజధాని రైతులకు పరిహారం గా సుమారు 80 నుంచి 90 వేల కోట్ల వరకు ఇవ్వాల్సి వస్తుందని, అంత డబ్బు ప్రభుత్వం దగ్గర ఉందా అంటూ ప్రశ్నించారు.రాజధానిలో నిర్మాణం పనులను బ్యాంకు రుణాలు తీసుకుని మరి కాంట్రాక్టర్లు చేపడుతున్నారని, దీనిపై వారు కోర్టుకు వెళితే పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా అంటూ ప్రశ్నించారు.
ఇలా అయితే లక్షన్నర నుంచి రెండు లక్షల కోట్ల వరకు వారికి చెల్లించాల్సి వస్తుందన్నారు.
వాస్తవంగా అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు అవసరమే లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజధాని నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసి జగన్ పరిపాలన మీద దృష్టి పెడితే ఏపీకి మేలు జరుగుతుందని సూచించారు.అంతకు ముందు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారస్తులు, కార్పొరేట్ కంపెనీలు పరిగెత్తుకు వచ్చేవని, కానీ ఇప్పుడు ఏపీ అంటే వెయ్యి కిలోమీటర్ల దూరం పరిగెత్తే పరిస్థితి కి జగన్ తీసుకువచ్చారు అంటూ విమర్శించారు.
రాజధానిలో పేరుతో ఏపీలో ప్రాంతాల మధ్య చిచ్చు రేపి దానిని రాజకీయంగా వాడుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారంటూ సుజన మండిపడ్డారు.