తెలంగాణ బిజేపీ లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ వ్యవహారంపై చర్చ జోరుగా సాగుతోంది.ఈ ఇద్దరు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ టిఆర్ఎస్ ను ఓడించి తమ సత్తా చాటుకుని బిజేపీ పరువు నిలబెట్టారు.
ఈ ఇద్దరి విజయంతో తెలంగాణ బిజేపీకి కొత్త ఆశలు చిగురించాయి.దీంతో వీరికి పార్టీలో ప్రాధాన్యం ఏర్పడింది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి నడుస్తోంది.అధికార పార్టీకి ఏకగ్రీవం అవకాశం దక్కకుండా ఈ ఎన్నికల్లో పోటీకి కొంతమంది అభ్యర్థులను నిలబెట్టింది.
అయితే బిజేపీ మాత్రం ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రకటించింది.దీనికి కారణం బీజేపీకి సొంతంగా బలం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
బిజేపీ నిర్ణయానికి భిన్నంగా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇండిపెండెంట్ అభ్యర్థులను నిలబెట్టి మద్దతు పలికారు.అసలు ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని బిజేపీ అధికారిక నిర్ణయం తీసుకున్నా, ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులను నిలబెట్టడం పై పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది.
అయితే వీరి వెర్షన్ వేరేలా ఉంది.ఆ ఇండిపెండెంట్ అభ్యర్థులను తామే నిలబెట్టమని బహిరంగంగానే చెప్పడమే కాకుండా, టిఆర్ఎస్ కు ఏకగ్రీవాలు కాకుండా చూసేందుకే ఈ విధంగా చేశామని వారు సమర్థించుకుంటున్నారు.
కరీంనగర్ లో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న రవీందర్ సింగ్ కు ఈటెల రాజేందర్ బహిరంగంగానే మద్దతు పలికారు. అలాగే ఆదిలాబాద్ లోనూ స్వతంత్ర అభ్యర్థిని పోటీకి విధించినట్లు రాజేందర్ ప్రకటించారు.
ఈ రెండు చోట్ల పోటీ చేస్తున్న అభ్యర్థుల ను తానే గెలిపించుకుంటాం అంటూ రాజేందర్ చెబుతున్నారు. ఆదిలాబాద్ విషయానికి వస్తే అక్కడ ఆదివాసి నేత ఒకరు పోటీ చేస్తున్నారు.
ఆమెకు రాజేందర్ మద్దతు పలికుతూ గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్నారు.
ఎమ్మెల్యే రఘునందన్ రావు సైతం అభ్యర్థిని పోటీకి దింపారు.బిజేపీ ఓట్లు వేరే పార్టీలకు వెళ్ళకుండా తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన ప్రకటించారు.పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న తరువాత ఆ నిర్ణయానికి కట్టుబడకుండా, ఇద్దరు ఎమ్మెల్యేలు సొంతంగా అభ్యర్ధులను నిలబెట్టడం పై బిజేపీ లోని ఒక వర్గం తీవ్రంగా తప్పు పడుతోంది.
ఇలా ఎవరికి వారే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే ఇక పార్టీ నిర్ణయానికి విలువ ఏమీ ఉంటుంది అంటూ ప్రశ్నిస్తున్నారు.