తెలంగాణలో అధికార పీఠం దక్కించుకుంటామనే ఆశ ఇప్పుడు బిజెపి నాయకుల్లో ఎక్కువగా కనిపిస్తోంది.మొన్నటి వరకు ఉసూరుమంటూ కనిపించినా, టిఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన అన్ని హామీలను అమల్లోకి తీసుకురాలేకపోయారని, దీని కారణంగానే ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న విషయాన్ని ఇప్పుడు తెలంగాణ బిజెపి నాయకులు హైలెట్ చేస్తున్నారు.
ఎలాగూ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో తమకే భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.అది కాకుండా కొత్తగా ఎంపికైన బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు సరికొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు.
ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్లాలంటే ప్రజా ఉద్యమాలు పోరాటాలు నిరంతరంగా చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది తెలంగాణ బీజేపీ.
జూన్ నెల మొత్తం నిత్యం ప్రజాందోళనలు నిర్వహించే విధంగా అక్కడి బిజెపి నాయకులు కసరత్తు చేస్తున్నారు.టిఆర్ఎస్ ప్రభుత్వంపై అన్ని ఆధారాలతో విరుచుకుపడే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు.
ప్రస్తుతం టిఆర్ఎస్ ప్రభుత్వ విధానాల్లో లోపాలను, ప్రభుత్వ నిర్ణయాల్లో తప్పిదాలను గుర్తించి వాటిపై పోరాడేందుకు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సిద్ధమవుతున్నారు.టిఆర్ఎస్ ప్రభుత్వంపై ఏ చిన్న అవకాశం దొరికినా, దానిని సద్వినియోగం చేసుకుని బిజెపికి మైలేజ్ వచ్చే విధంగా చేసుకోవాలని ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు.
ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సమగ్ర వ్యవసాయ విధానంపై పెద్దఎత్తున పోరాడేందుకు సిద్ధమవుతున్నారు.తమ కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే అధిష్టానం పెద్దల దగ్గర అనుమతి కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ టిఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలను ఉపేక్షించకుండా, పెద్దఎత్తున పోరాటం చేసి ప్రజల్లో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బిజెపి మాత్రమే అనే సంకేతాలు ఇచ్చే విధంగా ముందుకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.వచ్చే ఎన్నికల నాటికి బలమైన పార్టీగా బీజేపీని తెలంగాణలో ఆవిష్కరించాలని, కార్యకర్తల్లో ఉత్సాహం పెంచి ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా సిద్ధం అయ్యేందుకు తెలంగాణ బిజెపి నాయకులు రెడీ అవుతున్నారు.
ఈ మేరకు అధిష్టానం నుంచి కూడా పూర్తిగా సహాయసహకారాలు అందుతుండడంతో ఎక్కడా వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్లేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.