విజయవాడ: జనసేన తమతో కలిసి రావడం లేదని మా ఆరోపణ.జనసేన, బీజేపీ కలిసి వెళ్తేనే పొత్తు ఉందని ప్రజలు నమ్ముతారని బీజేపీ నేత మాధవ్ అన్నారు.
విజయవాడలో మంగళవారం జరిగిన పదాధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.ఇటీవల ఏపీలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ పార్టీల్లో కాక రేపాయి.
సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి.విజయవాడలో జరిగిన పదాధికారుల సమావేశంలో బీజేపీ నేత పీవీఎన్ మాధవ్ ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పందించారు.
‘‘జనసేన మాతో కలిసి రావడం లేదని మా ఆరోపణ.జనసేనతో పేరుకు మాత్రమే పొత్తు అనే పరిస్థితి ఉండటం వల్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నష్టం జరిగింది.
భాజపాకు దూరం కావాలంటే జనసేన ఇష్టం.కలిసి సాగాలనుకుంటే మాత్రం క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేయాలి.అప్పుడే ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుంది.తమ అభ్యర్థికి జనసేన మద్దతుందని పీడీఎఫ్ ప్రచారం చేసింది.
పీడీఎఫ్ ప్రకటన ఖండించాలని కోరినా జనసేన చేయలేదు.మేం వైసీపీ తో ఉన్నామన్న ప్రచారాన్ని ప్రజలు నమ్మారు.
బీజేపీ అధిష్ఠానానికి చెప్పే అన్నీ చేస్తున్నామని వైసీపీ ప్రచారం చేస్తోంది.ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ప్రచారాన్ని ప్రజలు నమ్మారని భావిస్తున్నాం.
వైసీపీతో బీజేపీ కలిసిపోయిందనే ప్రచారం కూడా నష్టం చేసింది.వైసీపీ వేసిన అపవాదును తుడిచివేసేందుకు ప్రయత్నిస్తాం.
మే నెలలో రాష్ట్ర ప్రభుత్వంపై ఛార్జ్షీట్ వేస్తాం.పొత్తుల విషయంలో అనేక ఆలోచనలు ఉన్నాయి.
ఆ విషయాన్ని పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని మాధవ్ తెలిపారు.