ఈ రోజు నాధురాం గాడ్సే పుట్టిన రోజు.నిజమైన దేశ భక్తుడు.
గాంధీ ని చంపడం కరెక్టా కదా అనేది debatable.కానీ అతని వైపు ఆర్గుమెంట్ ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు.కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది.అంటూ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ట్విట్టర్లో పోస్ట్ పెట్టడం ఇప్పటికీ పెద్ద దుమారాన్ని రేపుతోంది.
నాగేంద్రబాబు మాటలను కొంతమంది సమర్థిస్తున్నా, మరికొంతమంది మండిపడుతున్నారు.అసలు ఉన్నట్టుండి గాడ్సేను పొగడాల్సిన అవసరం నాగబాబు కు ఎందుకు వచ్చిందనే ప్రశ్నలు కూడా మొదలైంది.ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపడంతో పాటు పాటు తెలంగాణలో నాగబాబు పై కేసు కూడా నమోదైంది.
అలాగే జనసేన పార్టీపైనా ఆ ప్రభావం కనిపిస్తుండడంతో పాటు పవన్ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
ఇప్పటి వరకు దీనిపై పవన్ స్పందించలేదు.కానీ స్పందించి సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత ఆయనపై ఉందనే వాదనల తెరపైకి వస్తున్నాయి.
ఇప్పటికే నాగబాబు ఈ వ్యాఖ్యలపై స్పందించారు.దయచేసి అందరూ నన్ను అర్థం చేసుకోండి, నేను నాదూరాం గాడ్సే చేసిన నేరాన్ని సమర్థించలేదు.
నాథురం గాడ్సే వెర్షన్ కూడా జనానికి తెలియాలి అని మాత్రమే అన్నాను.నాకు మహాత్మాగాంధీ అంటే చాలా గౌరవం.
ఇన్ఫెక్ట్ నన్ను విమర్శించే వాళ్ల కన్నా నాకు ఆయనంటే గౌరవం అంటూ నాగబాబు మరో పోస్ట్ పెట్టారు.అయినా ఆయనపై విమర్శలు ఆగలేదు.
దీనిపైన స్పందించిన నాగబాబు తాను చేసిన వ్యాఖ్యలు కేవలం తన వ్యక్తిగతమని, దీనికి పార్టీకి , మిగతా నాయకులకు సంబంధం లేదంటూ ప్రకటించారు.
ఇదిలా ఉంటే నాగబాబు వ్యాఖ్యలపై బిజెపి చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం జనసేన కు బీజేపీతో పొత్తు ఉన్న కారణంగా ఈ వ్యాఖ్యల ప్రభావం తమపై పడుతుందని బిజెపి అంచనా వేస్తోంది.ఇప్పటికే పార్టీ నాయకుల ద్వారా పవన్ వివరణ కోరేందుకు బిజెపి నాయకులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
దేశ నాయకుల కు సంబంధించిన విషయాల్లో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని, అనవసర వివాదాలు జోలికి వెళ్తే పార్టీ భవిష్యత్తు దెబ్బతింటుందని బిజెపి కేంద్ర పెద్దలు పవన్ కు వర్తమానం పంపించినట్లు తెలుస్తోంది.ముందు ముందు మీరు గాని, పార్టీ నాయకులు గాని ఏదైనా వ్యాఖ్యలు చేసే ముందు ఆచతూచి వ్యవహరించాలని, అనవసర చిక్కుల్లో పడవద్దు అంటూ సూచించినట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ నాయకులు ఎవరు ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు.ఇక ఈ విషయంపై పవన్ కనీసం సోషల్ మీడియా ద్వారా కూడా స్పందించలేదు.
ఈ విషయంపై తాను ఏవిధంగా స్పందించినా, విమర్శలు వస్తాయనే ఉద్దేశంతో పవన్ సైలెంట్ అయినట్లు తెలుస్తోంది.