మొన్నటి వరకు అసలు తమకేమీ సంబంధం లేదన్నట్లుగా జనసేనతో వ్యవహరించినబీజేపీ నాయకులు , తమ అవసరం పవన్ కే ఉంది తప్ప పవన్ అవసరం మాకు ఏమీ లేదు అన్నట్లుగానే వ్యవహరించారు. జనసేన తో బీజేపీ పొత్తు పెట్టుకున్నా , ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించారు.
జనసేన బీజేపీ విడివిడిగా వివిధ కార్యక్రమాలు రూపొందించుకుని ముందుకు వెళ్లి ,రెండు పార్టీలు కలిసి ఓకే సమస్యపై పోరాడింది తక్కువే.ఇక తెలంగాణ లోనూ జనసేనకు ఇదే పరిస్థితి ఎదురవుతూ వచ్చింది.
బీజేపీ కోసం గ్రేటర్ ఎన్నికల బరి నుంచి జనసేన తప్పుకున్నా, ఆ పార్టీకి తగిన గౌరవ మర్యాదలు తెలంగాణ బీజేపీ నాయకులు ఇవ్వలేదు.
అసలు జనసేన పార్టీ తో తమకు ఏమి సంబంధం లేదు అని, తాము పొత్తు పెట్టుకోలేదని డీకే అరుణ , ధర్మపురి అరవింద్ వంటివారు జనసేన విషయంలో చులకనగా వ్యవహరించారు.
ఈ పరిణామాలు అన్నింటితో జనసేన సైతం విసుగు చెంది బీజేపీకి దూరం అవుదామని ప్రయత్నిస్తున్న సమయంలోనే, తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు వచ్చాయి.ఇక్కడ జనసేన సహకారంతో బీజేపీ పోటీకి దిగింది.
కానీ ఇక్కడ గెలవడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు కాబట్టి జనసేన సహకారం తప్పనిసరిగా కావాలని బీజేపీ కి అర్థం అయింది.అందుకే పవన్ ను ప్రసన్నం చేసుకునేందుకు రకరకాల మార్గాల ద్వారా బీజేపీ నేతలు ప్రయత్నిస్తూనే వస్తున్నారు.
స్వయంగా పవన్ కలిసి తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తో పాటు, సోము వీర్రాజు, సునీల్ దియోధర్ , పురంధరేశ్వరి వంటి వారు మద్దతు ఇవ్వాలని కోరారు.అంతేకాదు సోము వీర్రాజు మరో సంచలన ప్రకటన చేశారు.బీజేపీ జనసేన సీఎం అభ్యర్థిగా పవన్ ఉంటారని , పవన్ ను జాగ్రత్తగా చూసుకోవాలని బీజేపీ అగ్రనాయకత్వం తమకు చెప్పిందని వీర్రాజు ఓ సమావేశంలో ప్రకటించారు.అంతేకాదు జనసేన కు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు బీజేపీ అత్యధికంగా ప్రాధాన్యం ఇస్తూ, పవన్ ప్రసన్నం చేసుకుని ఇక్కడ గెలవాలని చూస్తోంది.
ఏపీ బీజేపీ లో స్టార్ డమ్ ఉన్న నేతలు ఎవరూ పెద్దగా లేకపోవడంతో పవన్ పైనే ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది.ప్రచారానికి వస్తే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని గట్టి పోటీ ఇచ్చి గెలిచి తీరుతాం అనే నమ్మకంతో బిజెపి నేతలు ఉండటంతోనే ఇప్పుడు పవన్ ను ఆకాశానికి ఎత్తేసే పనిలో పడ్డారు.