బిజీపీతో వైరం పెట్టుకోవడం ద్వారా తెలుగుదేశం పార్టీ అన్ని విధాల నష్టపోయిందని, రాజకీయంగా ఈ దుస్థితి రావడానికి అదే కారణమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించి కలకలం సృష్టించారు.ఇక అప్పటి నుంచి రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి.
వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీపై కక్ష తీర్చుకుంటుంది అనే ఉద్దేశం తో పాటు పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి వలసలు వెళ్లకుండా నిరోధించేందుకు చంద్రబాబు నాయుడు ఈ తరహా ఎత్తుగడలు వేసినట్టు అంతా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తెలుగుదేశం బీజేపీ పార్టీల పొత్తు కొనసాగుతున్న సమయంలో టీడీపీ బాగానే లాభపడింది.నాలుగేళ్ల పాటు సాగిన ఈ పొత్తును చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా తెంచేయడంతో పాటు తీవ్ర స్థాయిలో బీజేపీ మీద విమర్శలు చేశారు.ఆ పార్టీ ఆగ్రహానికి గురయ్యాడు.
ఫలితంగా ఈ ఎన్నికల్లో వైసీపీకి బీజేపీ అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందించి పరోక్షంగా ఆ పార్టీ విజయానికి కారణం అయ్యింది.ఇప్పుడు ఆ బాధ కూడా టీడీపీ అదినేతలో ఎక్కువగా కనిపిస్తోంది.
ఏపీలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ నాయకులంతా వైసీపీ, బీజేపీ పార్టీల్లోకి క్యూ కడుతున్నారు.
తాజాగా బీజేపీ తో పొత్తుకు తాము సిద్దం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన పరోక్ష వ్యాఖ్యలపై బిజెపి నాయకులు రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తూ టీడీపీ పరువు బజారున పడేస్తున్నారు.తమతో కలవాలని టీడీపీ చూస్తున్నా తాము ద్వారాలు ఎప్పుడో మూసేసామంటూ బీజేపీ ఏపీ ఇంఛార్జి సునీల్ ధియోధర్ ప్రకటించారు.దీనిపై టీడీపీలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుండగానే టీడీపీతో పొత్తు లు అనేవి ఉండవని, టీడీపీని బీజేపీలో విలీనం చేస్తామని ప్రకటిస్తే అప్పుడు ఆ విషయాన్ని పార్టీ హై కమాండ్ తో మాట్లాడి తాను ఒప్పిస్తానని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జివియెల్ నరసింహారావు హేళనగా మాట్లాడి కలకలం సృష్టించారు.
బీజేపీలో టీడీపీ విలీనానికి ఎలాగూ ఒప్పుకోరు అని జీవీయెల్ కు తెలిసినా ఆ విధంగా టీడీపీని తక్కువ చేసి మాట్లాడటంపై ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం టీడీపీలో హాట్ హాట్ గా జరుగుతున్న చర్చ ఇదే.