ఇప్పటివరకు ఏపీ అధికార పార్టీ వైసీపీ విషయంలో చూసి చూడనట్టుగానే వ్యవహరిస్తూ వస్తున్నారు బీజేపీ అగ్ర నాయకులు.వైసీపీ తమకు ఏపీలో ఎప్పటికైనా రాజకీయ ప్రత్యర్థి అవుతుందని తెలిసినా ముందుగా తెలుగుదేశం పార్టీని బలహీనం చేసి ఆ తరువాత వైసీపీ వ్యవహారం చూద్దాంలే అన్నట్టుగా బీజేపీ ఇప్పటి వరకు ఉంది.
కానీ కొద్ది రోజులుగా జగన్ బీజేపీ విషయంలో కవ్వింపు చర్యలకు దిగుతుండడంతో ప్రధాన దృష్టంతా ఇప్పుడు వైసీపీ మీద పెట్టింది.అసలు ముందుగా బీజేపీ వైసీపీ కలిసి తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తారని అంతా భావించారు.
అయితే అదే సమయంలో బీజేపీ కొద్ది కొద్దిగా వైసీపీ ని టార్గెట్ చేసుకోవడం, అదే రీతిలో వైసీపీ కూడా రియాక్షన్ ఇస్తుండడంతో వీరిద్దరి మధ్య వైరం రోజు రోజుకి మరింత ముదురుతూ వస్తోంది.ఏపీలో ఉమ్మడి ప్రత్యర్థి గా ఉన్న టీడీపీని బలహీనం చేసేందుకు గత ఆరు నెలలుగా వైసీపీ ఒకవైపు, బిజెపి మరోవైపు చాపకింద నీరులా ప్రయత్నిస్తోంది.
ఇప్పటికే అనేక మంది టిడిపి కీలక నాయకులతోనూ, వైసీపీ ఎమ్యెల్యేలతోనూ వైసీపీ, బిజెపి నాయకులు వేరువేరుగా భేటీలు నిర్వహిస్తూనే ఉన్నారు.ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపి తీర్థం తీసుకునేందుకు రెడీ అవుతున్నారు.కొంతమంది టీడీపీ నాయకులు వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.టీడీపీ నుంచి బయటకు వచ్చిన వల్లభనేని వంశీ పేరుకు తటస్థుడిగా ఉన్నా ఆయన పరోక్షంగా వైసీపీ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
ఈ నేపథ్యంలో ఉన్నట్లుండి బిజెపికి చెందిన మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు సోదరులను, కుమారుడిని తమవైపునకు లాక్కొంది వైసీపీ.ఒక్క గంగరాజు ఒక్కరే ఇప్పుడు బిజెపిలో ఉన్నారు.
మొత్తం గోకరాజు ఫ్యామిలీ వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధం అవుతోంది.
ఈ నేపథ్యంలో ఆగ్రహం చెందిన బీజేపీ ముందు తెలుగుదేశం పార్టీ సంగతి పక్కనపెట్టి వైసీపీ భరతం పట్టాలనే నిర్ణయానికి వచ్చింది.అసలు ముందుగా వైసీపీ విషయంలో బీజేపీనే కవ్వింపు చర్యలకు దిగింది.గత పదిహేను రోజులుగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో బిజెపి అధినాయకత్వంతో తరచూగా భేటీ అవుతున్నారు.
ఆయన పార్టీ మారకపోయినా తరచూ కేంద్ర మంత్రులను, బిజెపి అగ్ర నేతలను కలుస్తూ వైసీపీ అధిష్టానానికి ఆగ్రహం తెప్పిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఈ రోజు రాత్రి ఢిల్లీలో భారీ విందును కూడా ఏర్పాటు చేశారు రఘురామకృష్ణంరాజు.
ఈ విందుకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ చీఫ్ అమిత్ షా తో పాటు మరో మూడువేల మంది వీఐపీలు హాజరుకాబోతున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాల గురించి, వైసీపీ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చించబోతున్నట్టు తెలుస్తోంది.