ఏపీ బిజెపిలో అన్నీ తానే వ్యవహరిస్తూ, తనకంటూ సొంత పార్టీని ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై అప్పుడే వివాదం మొదలైంది.సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ఏపీలో బీజేపీ ని పరుగులు పెట్టిస్తున్నారు.
ఇక్కడ బీజేపీని బలోపేతం చేయడమే ఏకైక లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు.వీర్రాజు స్పీ డ్ తో ఏపీలో బీజేపీ బాగా బలపడింది అనే అభిప్రాయం ఆ పార్టీ అగ్రనేతల్లో రావడంతో, వీర్రాజు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
ఈ మేరకు అధిష్టానం ఆయనకు స్వతంత్రం కూడా ఇచ్చింది.
సొంత కమిటీని ఏర్పాటు చేసేందుకు కూడా అనుమతి ఇచ్చారు.
దీంతో మొత్తం 40 మంది తో ఏపీ బిజెపి కమిటీ ఏర్పాటైంది.పదిమంది ఉపాధ్యక్షులు, 10 మంది కార్యదర్శులు, ఐదుగురు ప్రధాన కార్యదర్శులు ఉన్నారు.
ఇదంతా ఇలా ఉంటే, ఇప్పుడు ఈ కొత్త కమిటీ పై అప్పుడే వివాదం మొదలైంది.మొదటి నుంచి బీజేపీ కోసం కష్టపడుతున్న తమను పక్కన పెట్టారనే ఫిర్యాదుతో కొంతమంది బీజేపీ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
అయితే ఈ కార్యవర్గాన్ని పదిమందికి తగ్గించాలంటూ, సోము వీర్రాజు హైకమాండ్ కు సూచించారట.
ఈ కమిటీలో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చినా, పార్టీ కోసం పనిచేసిన సీనియర్లను పక్కన పెట్టేశారనే ఫిర్యాదులు వస్తున్నాయి.ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారికి పార్టీ పదవులు ఇవ్వడంపైనా ఇప్పుడు వివాదం నడుస్తోంది.ముఖ్యంగా ఇప్పటికే ఎమ్మెల్సీ పదవి లో ఉన్న మాధవ్ కు, నెహ్రూ యువ కేంద్రం వైస్ చైర్మన్ గా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డికి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవులు ఇవ్వడం పైన ఇప్పుడు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
అలాగే కొత్త కార్యవర్గంలో విశాఖ నుంచి ప్రాధాన్యం ఎక్కువగా ఉండడం పైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అలాగే మొన్నటి వరకు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ కు సైతం ఏ పదవి ఇవ్వకుండా, పక్కన పెట్టడం పైన ఇప్పుడు వివాదం నడుస్తోంది.
ఇలా అనేక విషయాలపై బీజేపీ అధిష్టానానికి సోము వీర్రాజు వ్యతిరేక వర్గీయులు ఫిర్యాదు చేసేందుకు సిద్దమవుతుండటంతో, మళ్లీ ఏపీ బీజేపీలో గ్రూపులో గోల ఎక్కువైనట్టు గా కనిపిస్తోంది.