ఏపీ బీజేపీలో పార్టీ ఫండ్ స్కామ్ జరిగినట్టు ఇంటా, బయట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.ముఖ్యంగా ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తరపున బరిలోకి దిగిన అభ్యర్థులకు అందించేందుకు కొంత ఫండ్ ను బీజేపీ అధిష్టానం పంపించిందట.
ఆ సొమ్ము పంపిణీలో భారీగా అవకతవకలు జరిగినట్టు తేలడంతో అదే విషయమై కొంతమంది బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కు ఫిర్యాదు కూడా చేసినట్టు తెలుస్తోంది.ఢిల్లీ నుంచు వచ్చిన పార్టీ ఫండ్ ను కొంతమంది నేతలు కలిసి ఆ డబ్బును పంచుకున్నారట.
వాళ్ళు పంచుకోగా మిగిలిన కొద్ది మొత్తాన్నే అభ్యర్థులకు పంచారట.దీనిపై ఇప్పుడు ఏపీ బీజేపీలో పెద్ద దుమారమే రేగుతోంది.
ఏపీలో బీజేపీ అభ్యర్థుల ప్రచార ఖర్చుల నిమిత్తం పంపిన ఫండ్ లో సుమారు ముప్పైకోట్ల రూపాయల మొత్తాన్ని కొంతమంది నాయకులు పంచుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఏపీలో పార్టీ బలహీనంగా ఉన్నా, గెలిచే అవకాశం లేదని తెలిసినా పార్టీ ఫండ్ ను బాగానే ఇచ్చారట.పార్టీ తరఫున ఎవరూ వ్యక్తిగతంగా ఖర్చులు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఆ ఫండ్ ను బీజేపీ ఏర్పాటు చేసింది.అయితే ఆ ఫండ్ ను అభ్యర్థులకు అందించడంలో కొంతమంది నేతలు చేతివాటం చూపించారని, ఎవరెవరు ఎంతెంత మింగారో లెక్క తేల్చాలని అధిష్టానం దగ్గర ఏపీ బీజేపీ నేతలు కొంతమంది పంచాయితీ పెట్టారు.
ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఒక్కో జిల్లా స్థాయి నాయకుడికి సుమారు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల వరకు అందినట్టు తెలుస్తోంది.అయితే అభ్యర్థులకు అందాల్సిన ఆ సొమ్మును అలా తమ జేబులో వేసుకోవడంపై ఇప్పుడు లొల్లి మొదలయ్యింది.ఎంత సొమ్ము ఖర్చుపెట్టినా, ఎంతమంది ప్రచారం చేసినా ఏపీలో బీజేపీ గెలిచే పరిస్థితి లేదనే ఉద్దేశంతోనే సదరు నాయకులు గుట్టు చప్పుడు కాకుండా ఆ సొమ్మును పంచుకున్నట్టు అర్ధం అవుతోంది.ఇక బీజేపీ తరపున పోటీ చేసినవారిలోనూ చాలామంది పార్టీ ఫండ్ కోసమే పోటీ చేశారు తప్ప తాము గెలుస్తామనే ధీమా వారికి లేదనేది బహిరంగ రహస్యం.
అయితే ఇప్పుడు ఈ పార్టీ ఫండ్ విషయంలో బీజేపీ అధిష్టానం నిజాలు నిగ్గుతేలుస్తుందా లేక పరువు పోగట్టుకోవడం ఎందుకని సైలెంట్ అయిపోతుందా అనేది చూడాలి.
.