రాజకీయ నేతలు ఏ విషయాన్ని వదిలిపెట్టరన్న విషయం తెలిసిందే.అవకాశంగా చిక్కిన ఏ అంశాన్ని అయినా రాజకీయం చేస్తూ అనర్గళంగా ప్రసంగిస్తారు.
ఒక్కోసారి వారు మాట్లాడే మాటలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతాయి.ఇలా అందరు కాదు.
కానీ రాజకీయ నేతల్లో చాలమటుకు ఇలాంటి వారే కనిపిస్తారు.ఇకపోతే బీజేపీ నాయకురాలు, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తాజాగా రెడ్డి సామాజికవర్గం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మేడ్చల్ జిల్లాలో నిర్వహించిన రెడ్ల రణభేరిలో ఆమె మాట్లాడుతూ, రెడ్డి అనేది కులం కాదని అది ఒక టైటిల్ మాత్రమేనని అన్నారు.ఇదేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో రెడ్ల పరిస్థితి చెప్పుకోవడానికే గొప్పగా ఉందని కానీ వారు పడే కష్టాలు మాత్రం అర్ధం చేసుకోవడం లేదని వ్యాఖ్యానించారు.
రెడ్డి అంటే డబ్బున్న వారుగా చిత్రికరించే మనుషులు, వారిలో ఉన్న పేదవారిని మాత్రం గుర్తించరని వెల్లడించారు.
ఇకపోతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంతో మూడేళ్లుగా అగ్రవర్ణాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు నష్టపోయారని విమర్శించారు.
ఇక ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ నేతల మాటలను నమ్మి మోసపోవద్దని, నిరుద్యోగులు, ఉద్యోగులను ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు డీకే అరుణ.