త్వరలోనే ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్న తరుణంలో అన్ని పార్టీలు తమ బలం నిరూపించుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి.ఇటీవల తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో, ఇక్కడ ఎన్నికలు అనివార్యం కాబోతున్న తరుణంలో, అన్ని పార్టీలు తమ బలాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, అధికార పార్టీ వైసీపీ తిరిగి ఆ సీటును తమ ఖాతాలో వేసుకుని, ప్రజాబలం తమకే ఉందని నిరూపించుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది.
ఇక టీడీపీ విషయానికి వస్తే ఇక్కడ బలమైన నేతలను రంగంలోకి దింపి ఈ పార్లమెంట్ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకుంటే, ఇక తిరుగు ఉండదని, అన్ని రకాలుగా పైచేయి సాధించినట్లు అవుతుందని ,bపార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం వస్తుందని అంచనా వేస్తోంది.ఈ మేరకు అప్పుడే అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది.
కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని కానీ , వర్ల రామయ్య ను కానీ ఇక్కడి నుంచి ఎన్నికల బరిలోకి దింపాలని టిడిపి ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉంటే ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి లో పాగా వేయడం ద్వారా, రాబోయే రోజుల్లో అధికారాన్ని దక్కించుకునేందుకు ఇది సెంటిమెంట్ గా ఉపయోగపడుతుందని, తమ పార్టీకి ఇక్కడ మంచి పట్టు ఉండటం కలిసివస్తుందని, బిజెపి జనసేన పార్టీ సహకారం తప్పనిసరిగా తమకే లభిస్తుంది కాబట్టి ,ఈ పార్లమెంటు స్థానం బిజెపి పరం అవుతుందని బిజెపి నేతలు అంచనా వేస్తున్నారు .అయితే జనసేన మాత్రం 2019 ఎన్నికల్లో తాము బాగా దెబ్బ తిన్నాము అని, కానీ ఈసారి బిజెపి సహకారంతో తిరుపతి పార్లమెంటు స్థానాన్ని దక్కించుకోవాలి అనే ఆశలో జనసేన ఉంది.తిరుపతి లో పెద్ద ఎత్తున మెగా ఫ్యాన్స్ ఉండడం , వారంతా తమకు అండగా నిలబడతారని జనసేన అంచనా వేస్తోంది.
2019 ఎన్నికల్లో జనసేన బి ఎస్ పి, వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకున్న సమయంలో, పొత్తులో భాగంగా తిరుపతి స్థానానికి బిఎస్పి అభ్యర్థి పోటీ చేసి ఓటమి చెందారు.అయితే ఇప్పుడు మాత్రం బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపి బిజెపి సహకారంతో గెలవాలని , ఆ పార్టీ లెక్కలు వేసుకుంటున్నట్టు గా కనిపిస్తోంది.కానీ తిరుపతి పై గంపెడాశలు పెట్టుకున్న బిజెపి అంత తేలిగ్గా జనసేనకు ఆ అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే కనిపించడం లేదు .అసలే దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు తో మంచి జోష్ లో ఉన్న బీజేపీ ఇక్కడ కూడా అదే రకమైన ఫలితాలను సాధించాలనే పట్టుదలతో ఉండడంతో, వైసీపీతో ఉన్న కాస్తో కూస్తో స్నేహాన్ని సైతం వదులుకొని ఇక్కడి నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు గా కనిపిస్తోంది.కానీ పవన్ మాత్రం ఏదో రకంగా బీజేపీని ఒప్పించాలనే ప్రయత్నాల్లో ఉన్నారట.ఈ ఉప ఎన్నికల కారణంగా అటు జనసేనకు, ఇటు బీజేపీకి తీవ్ర ఇబ్బందులు వచ్చి పడినట్లుగా కనిపిస్తోంది.