రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే.అలాగే రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే విషయం చాలా సార్లు రుజువయింది.
అయితే కార్యకర్తలు మాత్రం పార్టీల భావజాలాలను సీరియస్ గా తీసుకొని ప్రాణాలు కోల్పోయిన వారున్నారు.రాజకీయాలు, రాజకీయ నాయకుల మాటలు, విమర్శలు పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి తప్ప అవేవీ శాశ్వతం కాదనేది ఎన్నికల సమయంలో పొత్తులు కుదుర్చుకున్నప్పుడు తెలియవస్తుంది.
అప్పటిదాకా నువ్వెంత, నేనెంత అనుకున్న ఇరు పార్టీల నాయకులు తప్పక పనిచేయాల్సి వస్తుంది.ఇలాంటి పరిస్థితులు చాలా సందర్భాలలో వచ్చిన విషయం మనం చూసాం.
అదే విధంగా క్షేత్ర స్థాయిలో కార్యకర్తల మధ్య సయోధ్య కుదరక ఇరు పార్టీలు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి.
అయితే ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ పై రకరకాల విమర్శలు చేస్తోంది.
ముఖ్యంగా బండి సంజయ్ కేసీఆర్ ఎన్ని రకాలుగా విమర్శించాలో అన్ని రకాలుగా విమర్శించాడు.కొత్త లో ప్రజలు బాగానే స్పందించినా టీఆర్ఎస్ మౌనం వహించడంతో అవి ప్రజల్లోకి వెళ్లలేక పోయాయి.
ఇక రానురాను బండి సంజయ్ విమర్శలను, బీజేపీ నాయకుల విమర్శలను ప్రజలు పట్టించుకోవడం మానేశారు.కావాలనే విమర్శిస్తున్నారనే భావన ప్రజల్లో కలిగింది.అయితే ఇప్పుడు విమర్శలే ప్రజల్లోకి వెళ్లకపోతే భవిష్యత్ రాజకీయం చాలా కష్ట సాధ్యం అని భావించిన బీజేపీ విమర్శలలో కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది.ఎలా విమర్శిస్తే ప్రజల చూపు మళ్లీంచుకోవచ్చు అనే కోణంలో బీజేపీ వ్యూహ రచన చేస్తోంది.