ఎట్టకేలకు తన పూర్వాశ్రమమైన బిజెపిలో కి తెలంగాణ ఫైర్ బ్రాండ్ విజయశాంతి, అలియాస్ రాములమ్మ చేరిపోయారు.ఆమె బిజెపిలో చేరబోతున్నారు అంటూ చాలా కాలంగా వార్తలు వచ్చినా, చివరివరకు ఆమె ఖండించలేదు.
కనీసం బిజెపిలోకి వెళ్తున్నానని ఎక్కడా ప్రకటించలేదు.గ్రేటర్ ఎన్నికలు ముగియగానే బిజెపి అగ్రనేతలైన అమిత్ షా వంటి వారిని కలిసి అనేక అంశాలపై చర్చించి, బిజెపి జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ ఆధ్వర్యంలో బిజెపి లో చేరిపోయారు.1998 జనవరి 26 న బిజెపి లో చేరిన విజయశాంతి 2005లో ఆ పార్టీని వీడి తల్లి తెలంగాణ పార్టీ ని స్థాపించారు.
ఆ తరువాత ఆ పార్టీని టిఆర్ఎస్ లో విలీనం చేసి , ఎంపీ గా టిఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు.
ఆ తరువాత టీఆర్ఎస్ నుంచి ఆమెను తొలగించడంతో ,ఆమె కాంగ్రెస్ లో చేరిపోయారు.అక్కడ ఆమెకు పరిస్థితులు అనుకూలించక పోవడం వంటి వ్యవహారాలతో మళ్ళీ బిజెపిలో చేరారు.
ఇదిలా ఉంటే ఆమె బిజెపిలో చేరే క్రమంలో ఎన్నో రకాల ట్విస్ట్ లు నెలకొన్నాయి.ఆమె నిన్న ఉదయం బిజెపిలో చేరారు.అంతకుముందే పార్టీ ప్రధాన కార్యదర్శి ఆమెను పార్టీలోకి ఆహ్వానించడం, సభ్యత్వం రసీదును ఆమెకు అందించడం,. తర్వాత బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా ను కలిశాక పార్టీ కండువా కప్పి ఆహ్వానించడం, ఆ తర్వాత తెలంగాణ బిజెపి నాయకులు కిషన్ రెడ్డి బండి సంజయ్ వంటి వారితో భేటీ కావడం వంటి ఎన్నో వ్యవహారాలు నడిచాయి.
అయితే స్టార్ క్యాంపెయినర్ ఇమేజ్ ఉన్న విజయశాంతి అనే బాణాన్ని కెసిఆర్ పై ఎక్కువ పెట్టాలనే ఆలోచనలో బిజెపి ఉన్నట్లు తెలుస్తోంది.అందుకే ఆమెకు కీలక పదవిని అప్పగించే ఆలోచనలో బిజెపి అధిష్టానం ఉన్నట్లు సమాచారం.
కేసీఆర్ పై నేరుగా విమర్శలు చేయడంలో విజయశాంతి దూకుడుగా ఉంటారు.అందుకే ఆమెకు కీలక పదవి అప్పగించే ఆలోచన బిజెపి అధిష్టానం కసరత్తు మొదలు పెట్టినట్లు సమాచారం.