తెలంగాణ లో అధికారం సాధించడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకుంది బిజెపి. రెండుసార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంటుందని, కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలతో సతమతమవుతూ రోజు రోజుకీ బలహీనం అవుతున్న నేపథ్యంలో బిజెపికే ప్రజలు అధికారం కట్టబెడతారని బలంగా నమ్ముతోంది.
తెలంగాణలో బిజెపి గెలవడం ద్వారా , దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రభావం లేకుండా చేయవచ్చని బిజెపి హైకమాండ్ పెద్దలు భావిస్తున్నారు.అందుకే పదే పదే తెలంగాణలో పర్యటిస్తూ, ఆ పార్టీ అగ్ర నాయకులంతా తెలంగాణ బిజెపి నాయకులను మరింత యాక్టీవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటికే తెలంగాణలో భారీ బహిరంగ సభలు నిర్వహించారు.
ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న నేపథ్యంలో మరిన్ని సభలు నిర్వహించి తెలంగాణ ప్రజలు చూపు బిజెపి పడేలా చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.రాబోయే తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే బీజేపీ విస్తృత కార్యాచరణను మొదలుపెట్టింది. అలాగే పార్టీ సీనియర్ నాయకులతో ఎన్నికల కమిటీని నియమించింది.
తెలంగాణ ఇన్చార్జిలుగా ఉన్న సునీల్ బాన్సాల్, తరుణ్ ఛుగ్ లతో పాటు మరో నలుగురిని కమిటీలు సభ్యులుగా చేర్చింది.తెలంగాణతో పాటు , ఒడిశా, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్ పంజాబ్ హర్యానా వంటి రాష్ట్రాల్లో గుర్తించిన 160 లోక్ సభ పార్లమెంట్ స్థానాల్లో పార్టీ విస్తరణ , నిర్దేశిత కార్యక్రమాల అమలును పర్యవేక్షించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించింది.
బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా , కేంద్ర హోం మంత్రి తోపాటు, తెలంగాణ బిజెపి నేతలతో చర్చించి మార్చి నుంచి సెప్టెంబర్ వరకు వరుసగా నియోజకవర్గ స్థాయి నుంచి, రాష్ట్రస్థాయి వరకు చేపట్టాల్సిన కార్యక్రమాల పైన బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రజా ఉద్యమాలపైన అనేక సూచనలు చేశారు.అలాగే పార్టీ కార్యక్రమాల అమలు పరిరక్షించేందుకు వీలుగా ఆరుగురు సభ్యుల కమిటీని బిజెపి నియమించింది.నియోజకవర్గాల్లో బూతు స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడం, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటాలు చేపట్టడం వంటివి ఎన్నో చేపట్టే విధంగా వ్యూహాలు రచిస్తున్నారట.