ఒకే దేశం ఒకే ఎన్నిక అనే నినాదం ఎప్పటి నుంచో వస్తున్నా, అది కార్యరూపం దాల్చదని చాలామంది అంచనా వేశారు.దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించబోతున్నారు అని చాలా కాలంగా , చాలా రాజకీయ పార్టీలు హడావుడి చేస్తూనే వస్తున్నాయి.
కానీ కేంద్రం ఈ విషయంలో నోరు మెదపక పోవటంతో అవన్నీ వట్టి గాసిప్స్ అని అంతా అనుకున్నారు.కానీ రెండు రోజులుగా కేంద్రం త్వరలో జమిలి ఎన్నికలకు సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు ఇస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఎన్నికల అంశం పై మాట్లాడడంతో ఒక్కసారిగా అన్ని రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి.జమిలి ఎన్నికలు రాబోతున్నాయని హడావిడి చేస్తూ, కసరత్తులు మొదలు పెట్టాయి.
దీనికి తగ్గట్టుగానే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పడంతో, 2022 లో ఖచ్చితంగా జమిలి ఎన్నికలు వస్తాయని అంతా డిసైడ్ అయిపోయారు.ఇక ఎన్నికలు నిర్వహించేందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది.
దీనికి అవసరమైన బలం బీజేపీకి ఉంది.రాజ్యసభలో పూర్తిగా మెజారిటీ లేకపోయినా, వివిధ ప్రాంతీయ పార్టీల సహకారంతో బిల్లును పాస్ చేయించే శక్తిసామర్ధ్యాలు బిజెపికి ఉన్నాయి.
ఈ విషయంలో కొన్ని రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నా, అంతిమంగా బిజెపి పెద్దలు తీసుకునే నిర్ణయం కాబట్టి త్వరలోనే ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
రాజ్యాంగపరంగా చేయాల్సిన మార్పులు చేర్పుల గురించి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ఒక నివేదికను తెప్పించుకున్నట్లు తెలుస్తోంది.అలాగే అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకున్నారు.ఈ పరిణామాలు అన్నిటితోనూ జమిలి ఎన్నికలు రావడం పక్కా అనే విషయం స్పష్టంగా అర్థమైపోయింది.
ఈ మేరకు అన్ని పార్టీలు 2022 ను టార్గెట్ చేసుకుని ముందుకు కదులుతున్నాయి.జమిలి ఎన్నికలకు వెళ్లడం ద్వారా మరోసారి కేంద్రంలో బిజెపి హవా చాటుకుని తమకు తిరుగులేకుండా చేసుకోవాలనేది బీజేపీ పెద్దల వ్యూహంగా కనిపిస్తోంది.
కేంద్రం నిర్ణయంతో దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధం కావాల్సిందే.అన్ని పార్టీలకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఎన్నికలకు వెళ్లాల్సిందే అన్నట్టుగా పరిస్థితి తయారైంది.