మొదటి నుంచి వైసీపీ, బీజేపీ మధ్య కాస్తోకూస్తో సాన్నిహిత్యం ఉండేది.పరోక్షంగా ఒకరికొకరు సహకరించుకుంటూ వచ్చేవారు.
అయితే తిరుపతి ఎన్నికలతో వైసీపీ , బీజేపీ మధ్య అటువంటి సఖ్యత ఏమీ లేదని, రెండు రాజకీయ బద్ధ శత్రువులు అనే విషయం అందరికీ అర్థమైపోయింది. వైసిపి అభ్యర్థిని ఓడించేందుకు బీజేపీ జనసేన కలిసికట్టుగా ని ఎన్నికల్లో ప్రచారం నిర్వహించాయి.
బిజెపి అగ్రనేతలు చాలామంది తిరుపతి లోకసభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారు.అంతేకాకుండా, పరిపాలన వ్యవహారాలపై సుదీర్ఘ అనుభవం ఉన్న కర్ణాటక మాజీ చీఫ్ సెక్రటరీ కత్తి రత్నప్రభ బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టారు.
వైసీపీ నుంచి డాక్టర్ గురుమూర్తి పోటీ చేయడం ఈ ఎన్నికల తంతు సైతం ముగిసిపోయింది. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని , పెద్ద ఎత్తున దొంగ ఓట్లను వేయించారని, ఆ విధంగా వైసిపి గెలవబోతోంది అంటూ బిజెపి హడావుడి మొదలు పెట్టింది.
అయితే ఇక్కడ అక్రమాలు జరిగాయ లేదా అనేది పక్కనపెడితే, మళ్లీ ఇక్కడ వైసిపి అభ్యర్థి గెలుస్తాడు అనేది అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఈ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు.
అది కాకుండా , జగన్ సంక్షేమ పథకాలు జనాల్లోకి వెళ్లాయి అని ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు రుజువు చేశాయి.అయినా బిజెపి టిడిపి వంటి పార్టీలు వైసీపీ దొంగ ఓట్ల ద్వారా గెలవబోతుంది అనే ప్రచారం ముమ్మరం చేశాయి.
ఇక్కడితో వదిలిపెట్టకుండా, బిజెపి అభ్యర్థి రత్నప్రభ హైకోర్టులో పిటిషన్ సైతం వేశారు .తిరుపతి ఉప ఎన్నికలను వెంటనే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేస్తూ పిటిషన్ లో పేర్కొన్నారు.ఈ పిటిషన్ లో సీఈసీ నీ, ఇతర అభ్యర్థులను ప్రతివాదులుగా చేర్చారు.ఈ పిటిషన్ కనుక విచారణ కు వస్తే ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠగా మారింది.
వాస్తవంగా ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం తిరుపతి లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెంటనే విడుదల కావు.చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు, తిరుపతి ఎన్నికల ఫలితం వెలువడుతోంది.కానీ దాని కంటే ముందుగానే రత్నప్రభ ఎన్నికలను రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్ పై విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది.వాస్తవంగా తిరుపతి లోక్ సభ పరిధిలోని తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం లోనే దొంగ ఓట్లు పడ్డాయి అని, బీజేపీ టీడీపీలు ఆరోపిస్తున్నాయి.
కానీ ఇప్పుడు మొత్తం ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతున్న తీరే ఆసక్తికరంగా ఉంది.