టీడీపీ నుంచి ఎప్పుడు ఎవరు బయటకు వెళతారో ? ఆ పార్టీ నేతలే ఊహించడం లేదు.నిన్న మొన్నటి వరకు నేతలు బయటకు వెళ్లిపోతే ఇప్పుడు ఏకంగా ఫ్యామిలీలకు ఫ్యామిలీలే పార్టీపై నమ్మకం లేక బయటకు వెళ్లే ప్లాన్లు వేసుకుంటున్నారు.
మరి కొందరి బలహీనతలను ఆసరాగా చేసుకుని ఇతర పార్టీలు వారిపై వల వేస్తున్నాయి.అంత ఎందుకు ? టీడీపీతో ఎంతో అవినాభావ సంబంధం ఉన్న పరిటాల లాంటి ఫ్యామిలీలే రాజకీయంగా సైలెంట్ అయ్యాయి.ఈ కుటుంబాలు సైతం బీజేపీలోకి వెళ్లాలా ? వద్దా ? అన్న ఊగిసలాటలో ఉన్నాయన్న ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. ఇక ఇప్పుడు మరో బలమైన టీడీపీ కుటుంబంపై సైతం బీజేపీ వల వేసిందన్న ప్రచారం జోరుగా నడుస్తోంది.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కిమిడి కళా వెంకటరావు కుటుంబానికి ఎంతో ప్రాధాన్యం ఉంది.ఆయన గత నాలుగు దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్నారు.టీడీపీలో ఓ వెలుగు వెలిగిన ఆయన ఆ తర్వాత ప్రజారాజ్యంలోకి వెళ్లి తిరిగి టీడీపీలోకి వచ్చి మంత్రి అవ్వడంతో పాటు ఏకంగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అయ్యారు.అయితే గత కొంత కాలంగా ఆ కుటుంబం టీడీపీలో ఇమడ లేని పరిస్థితి.
గత టర్మ్లో చంద్రబాబు ఆ కుటుంబంలో కళా వెంకటరావుతో పాటు ఆయన మరదలు మృణాళికి కూడా మంత్రి పదవులు ఇచ్చారు.గత ఎన్నికల్లో మృణాళిని తనయుడు నాగార్జున చీపురుపల్లిలో ఓడిపోగా ప్రస్తుతం ఆయనకు విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ పగ్గాలు ఇచ్చారు.ఇక కళా వెంకటరావును పొలిట్ బ్యూరోలోకి తీసుకున్న చంద్రబాబు ఆయన కుమారుడు రాం మల్లిక్ నాయుడుని రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు.ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నతో పాటు కింజారపు కుటుంబం హవానే నడుస్తోంది.
ఈ క్రమంలోనే బీజేపీ నేతలు కళా ఫ్యామిలీకి గాలం వేస్తున్నట్టు భోగట్టా.! ఇప్పుడున్న పరిస్థితుల్లో కళా వెంకటరావు ఏ పార్టీలోకి వెళ్లకపోయినా ఆయన కుటుంబంలో కొందరు నేతలు బీజేపీలోకి వెళ్లినా ఆయన అభ్యంతరం పెట్టరనే అంటున్నారు.
బీజేపీ ఇప్పటికే ఉత్తరాంధ్రలో కాపులను బాగా టార్గెట్ చేస్తూ వారిని తమ వైపునకు తిప్పుకుంటోంది.ఈ క్రమంలోనే కళా ఫ్యామిలీపై దృష్టి పెట్టిందని అంటున్నారు.