సూర్యాపేట జిల్లా:గ్రూప్1 ప్రిలిమ్స్ పేపర్ లీకేజీ దోషులను వెంటనే అరెస్టు చేసి,సిట్టింగ్ జడ్జిచే విచారణ చేపట్టాలని బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బోబ్బా భాగ్యరెడ్డి డిమాండ్ చేశారు.ప్రభుత్వ తీరును నిరసిస్తూ శనివారం సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడుతూ లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆశలు నీరుగారేలా రాష్ట్ర ప్రభుత్వమే లీకేజీలను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు.
సీఎం కేసీఆర్ కు నిరుద్యోగుల ఉసురు తలుగుతుందని శాపనార్థాలు పెట్టారు.పేపర్ లీకేజీ ఘటనలో నిరుద్యోగులకు ఒక్కొక్కరికి రూ.1లక్ష పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.టీఎస్పీఎస్సి లీకేజీపై బాధ్యత వహించి మంత్రులు కేటీఆర్,సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలన్నారు.
లీకేజీ దోషులను వెంటనే అరెస్టు చేసి చట్ట ప్రకారం శిక్షించాలని లేనిపక్షంలో ఆందోళనలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.అనంతరం ఏవో శ్రీదేవికి బీజేపీ నాయకులు మెమోరాండం అందించారు.
ఈ కార్యాక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేంద్ర, మల్లెపాక సాయిబాబా, అసెంబ్లీ కన్వీనర్లు కర్నాటి కిషన్,కాపా రవి కుమార్, కనగల నారాయణ,పట్టణ అధ్యక్షుడు అబీబ్,జిల్లా నాయకులు తుక్కని మన్మధరెడ్డి,చలమల నర్సింహ,పల్స మల్సూర్ కట్కూరి కార్తీక్,పగిళ్ళ సుశీందర్ రెడ్డి మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.