ఏపీ పై బీజేపీ ఆశలు ఎక్కువగానే పెట్టుకుంది.తమకు తప్పకుండా ఏపీలో అధికారం దక్కుతుందనే అంచనాలో ఉంది.
తెలుగుదేశం పార్టీ బాగా బలహీన పడుతుంది కాబట్టి, ఆ స్థానాన్ని తాము సులువుగా ఆక్రమించి పాగా వేయవచ్చని అంచనా వేస్తోంది.ఎప్పటి నుంచి ఏపీలో బలపడాలని చూస్తున్నా, ఆ అవకాశం రావడం లేదు.
కనీసం నామమాత్రంగా అయినా ఎప్పుడు గెలవలేకపోయింది.ఎప్పుడూ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని 1,2 సీట్లను సంపాదించడం మినహా, ఆ పార్టీకి ఎప్పుడూ ఆదరణ లభించింది లేదు.
కానీ 2024 ఎన్నికల నాటికి బలం పుంజుకుని, తమ మిత్రపక్షమైన జనసేన తో కలిసి అధికారం దక్కించుకోవాలనే అభిప్రాయంతో బీజేపీ అడుగులు వేస్తోంది.అయితే ఇప్పటి వరకు తమ మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బలాన్ని తక్కువగా అంచనా వేసిన బీజేపీ నేతలు పవన్ పుట్టినరోజు ముందు నుంచి తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు.
పవన్ కు ఎవరికీ లేనంత క్రేజ్, అభిమానుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని, కానీ పవన్ కు రాజకీయాలు ఏ విధంగా ముందుకు నడిపించాలో తెలియక విఫలం అవుతున్నారు అనే విషయాన్ని బీజేపీ గుర్తించింది.ఇప్పటి వరకు పవన్ బలాన్ని తక్కువగా అంచనా వేశామని, కాని ఏపీలో అధికారం దక్కించుకోవాలంటే పవన్ తో కలిసి ముందుకు వెళ్తే అది సాధ్యమవుతుందని గుర్తించింది.
తమకు నాయకుల బలం ఉన్నా, క్షేత్రస్థాయిలో ప్రజా బలం లేదని, కార్యకర్తల సంఖ్య తక్కువగా ఉందని, కానీ పవన్ కు కోట్లాదిమంది అభిమానులు ఉన్నారని, పవన్ పిలుపు ఇచ్చినా, ఇవ్వకపోయినా వారు జనసేనను జనాల్లోకి తీసుకువెళ్లే విధానం ఇవన్నీ బీజేపీకి బాగా నచ్చాయి.
అందుకే పవన్ కళ్యాణ్ కు మరింత ప్రాధాన్యం ఇచ్చి, ఆయనను మరింత గా యాక్టివ్ చేయాలని, పవన్ మద్దతు ఉంటే ఆయన అభిమానుల అండదండలతో పాటు, ఏపీలో ప్రధాన సామాజిక వర్గమైన కాపులు కూడా బీజేపీ వెంట నడుస్తారని, క్షేత్రస్థాయిలో బీజేపీ బలపడేందుకు అవకాశం ఏర్పడుతుందని ఇలా ఎన్నో లెక్కలు వేసుకుంటోంది.
బీజేపీ పై ప్రజా పోరాటాలు, ఉద్యమాల విషయంలో కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని, పవన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైతే బీజేపీ జనసేన కూటమి తరపున కాబోయే ముఖ్యమంత్రి పవన్ అనే విషయాన్ని ప్రకటించేందుకు కూడా బీజేపీ సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.జనసేన బీజేపీ ఈ విధంగా అభిప్రాయపడుతున్న ఈ విషయం తెలియడంతో జనసైనికుల్లోనూ మరింత ఉత్సాహం కనిపిస్తోంది.