ఏపీ మంత్రి కొడాలి నాని బీజేపీ నాయకులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఎక్కడ తగలాలో అక్కడే గట్టిగా తగిలినట్టు ఉన్నాయి.అంతర్వేది రథం దగ్ధం అయిన వ్యవహారం దగ్గర నుంచి ఏపీ అధికార పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ ను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తూ, ఏపీ బీజేపీ నాయకులు హడావుడి చేశారు.
జగన్ హిందుత్వానికి వ్యతిరేకి అంటూ మండిపడ్డారు.దీంతో అనవసరంగా తామెందుకు నిందలు మోయాలనే ఉద్దేశంతో, ఈ వ్యవహారం మరింత ముదరకుండా, ఏపీ సీఎం జగన్ అంతర్వేది వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలి అంటూ ఏపీ డీజీపీ ద్వారా సిబిఐకి లేఖ రాయించారు.
ఈ విధంగా ఈ వ్యవహారాన్ని కేంద్రం కోర్టులో కి జగన్ నెట్టారు.
అయినా ఏపీ బీజేపీ నేతలు వైసిపిని ఉద్దేశించి పదే పదే విమర్శలు చేస్తూ ఉండడం వంటి సంఘటనతో కొద్ది రోజులుగా హడావుడి నడుస్తోంది.
ఇదిలా ఉంటే జగన్ తిరుమలకు వెళ్లే విషయంపైన బీజేపీ-టిడిపి హడావుడి చేశాయి.జగన్ క్రిస్టియన్ కాబట్టి అక్కడ సంతకం పెట్టాల్సిందేనంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి.దీనికి ఘాటుగా స్పందించిన ఏపీ మంత్రి కొడాలి నాని ప్రధాని నరేంద్ర మోదీ భార్య వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చి బీజేపీ నేతలను ప్రశ్నించడంతో, ఈ వ్యవహారం కేంద్ర బీజేపీ పెద్దల వరకు వెళ్ళింది.
అసలు తిరుమలలో జగన్ డిక్లరేషన్ పై సంతకం పెడతారా లేదా అనేది జనాలకు అవసరం లేదని, పరిపాలనకు సంబంధించిన అంశాల పైనే ప్రజలు ఆలోచిస్తారని, అటువంటిది అనవసరంగా ఈ వ్యవహారంలో అతిగా స్పందించి ప్రధాని నరేంద్ర మోడీ భార్య వ్యవహారాన్ని తెరపైకి తీసుకు వచ్చి మోదీ కి అవమానం జరిగేలా చేశారని, ఇదంతా మీ వల్లే అంటూ కేంద్ర బీజేపీ పెద్దలు ఏపీ బీజేపీ నాయకులకు గట్టిగానే క్లాస్ పెట్టినట్లు తెలుస్తోంది.ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు అధికార పార్టీపై విమర్శలు చేసేందుకు అనేక అంశాలు ఉన్నాయని, కానీ వాటిని పక్కనపెట్టి డిక్లరేషన్ అంశంపైనే ఫోకస్ పెట్టి అనవసర రాద్ధాంతం చేసారని మండిపడినట్లు కథనాలు బయటకు వస్తున్నాయి. అధిష్టానం పెద్దల వార్నింగ్ లతో ఏపీ బీజేపీ నాయకులు సైలెంట్ అయినట్టుగా కనిపిస్తున్నారు.