తెలంగాణలో అతి పెద్ద పార్టీగా ఉన్న టిఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కోగల సమర్థులం తామేనని బీజేపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.అంతేకాకుండా వచ్చే ఎన్నికల నాటికి బలమైన పార్టీగా బిజెపి తయారుచేయడమే కాకుండా అధికారం దక్కించుకుంటుంది అనే ఆశలో ఆ పార్టీ నాయకులు ఉన్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలహీన అవ్వడం, వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ ఉనికిలో ఉండడమే ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో బీజేపీలో ఆశలు పెరగడానికి కారణంగా కనిపిస్తున్నాయి.ఇదే అభిప్రాయం కేంద్ర బిజెపి పెద్దల్లోనూ ఉండటంతోనే, తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా ఎంపీ బండి సంజయ్ ను నియమించారు.
ఇక ఆయన తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి చేపట్టిన దగ్గర నుంచి పార్టీ కార్యక్రమాల జోరు పెరిగింది.నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో కార్యకర్తల్లో జోష్ నింపడంతో పాటు, జనాల్లోనూ మంచి పేరు సంపాదించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.
బిజెపి రోజురోజుకు బలపడుతోంది అనే సంకేతాలు వస్తుండడంతో, చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న చాలామంది నాయకులు ఇప్పుడు బిజెపి లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.కానీ ఇతర పార్టీ నాయకులు ఇప్పుడు బీజేపీ లోకి వచ్చి చేరితే, వారి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోగా, అనవసర తలనొప్పులు వస్తాయనే ఆలోచనలతో బండి సంజయ్ ఉన్నట్లు తెలుస్తోంది.
అందుకే పార్టీలోకి వలసలను ప్రోత్సహించకుండా సొంతంగా నాయకులను తయారు చేసుకుంటే, వారు పార్టీకి చిత్తశుద్ధి తో పని చేస్తారని ఆయన నమ్ముతున్నారట.
ఇదే విషయాన్ని బిజెపి అధిష్టానం వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.దీంతో కాంగ్రెస్ నుంచి బిజెపి లోకి వచ్చి రాజకీయ భవిష్యత్తును తీర్చిదిద్దుకునే ఆలోచనలో ఉన్న నేతల ఆశలకు గండి పడినట్లేననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.కాకపోతే పూర్తిగా చేరికలను వ్యతిరేకించకుండా, అవసరమైన చోట మాత్రమే ,పార్టీకి ఉపయోగపడతారు అనుకున్న నాయకులను మాత్రమే చేర్చుకోవాలనే ఆలోచనతో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నారట.