ఏపీ రాజధాని వ్యవహారం రాజకీయ పార్టీలకు ఆటలో అరటిపండు గా మారిపోయింది.గతంలో టిడిపి ప్రభుత్వం ఉండగా అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించి అక్కడ వేలాది మంది రైతుల భూములను సేకరించి రాజధాని నిర్మాణ పనులు చేపట్టారు.
దీనిపై ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్ద రాద్ధాంతం చేసింది.దీనిపై అప్పట్లో టిడిపి ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ ని కూడా నియమించి సమగ్రంగా అధ్యయనం చేయించింది.
అయితే ఆ కమిటీ ఇచ్చిన నియమ నిబంధనలు పాటించకుండా, ఆ ప్రాంతంలో రాజధానికి అనుకూలంగా లేదు అని కమిటీ రిపోర్టు ఇచ్చినా అమరావతి టిడిపి జై కొట్టింది అనే విమర్శలు ఎదుర్కొంది.ఇక అక్కడే పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టడం, అనేక కార్యాలయాలు, ప్రభుత్వ సిబ్బందికి క్వార్టర్స్, ఇలా భారీ నిర్మాణాలు, మౌలిక సదుపాయాలు అక్కడ ఏర్పాటు చేశారు.
వైసీపీ అధికారంలోకి రాగానే అమరావతి ని పూర్తిగా పక్కన పెట్టడంతో పాటు, కేవలం శాసన రాజధానిగా మాత్రమే అమరావతిని ప్రకటించింది.దీనిపై పెద్ద రాద్దాంతం జరుగుతోంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి నుంచి రాజధాని ని తరలింపు చేయడానికి వీలు లేదంటూ, ఆ ప్రాంత రైతులు, టిడిపి జనసేన వంటి పార్టీలు హడావుడి చేస్తున్నాయి.ఈ విషయంలో బిజెపి వైఖరి అనుమానాస్పదంగా ఉంటోంది.
బిజెపి నాయకులు అమరావతికి జై కొట్టినా, కేంద్ర బిజెపి పెద్దలు మాత్రం మౌనంగా ఉండి పోతున్నారు.దీంతో అసలు బిజెపి ఏ క్లారిటీతో ఉంది అనే విషయం అందరికి సందేహంగా మారింది.
పార్టీ నుంచి ఏ క్లారిటీ లేక పోవడంతో, టిడిపి నుంచి బిజెపిలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వంటి వారు రాజధానిని ఒక్క అంగుళం కూడా కదిలించలేరు అని, కేంద్రం కూడా అమరావతి పై క్లారిటీ గా ఉందని, అమరావతి నుంచి రాజధాని తరలింపు పై కేంద్రం చూస్తూ ఊరుకోదు అంటూ గట్టిగానే ఏపీ ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తున్నారు.
ఈ వ్యవహారం కేంద్రం మెడకు చుట్టుకునే లభించడంతో, కేంద్ర బిజెపి పెద్దలు రంగంలోకి దిగిపోయారు.ఇప్పటికే జీవీఎల్ నరసింహారావు వంటి వారు అమరావతి రాజధానిగా ఉంచేందుకు తమకు అభ్యంతరం లేదని చెబుతూనే, ఇది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని, కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోదు అని చెబుతున్నారు.ఇక బిజెపి ఇన్ చార్జి సునీల్ దేవధర్ కూడా ఇదే విషయాన్ని క్లారిటీగా చెప్పేస్తున్నారు.
అమరావతిని రాజధానిగా ఉంచినా, తమకు అభ్యంతరం లేదని, ఒకవేళ రాజధాని తరలింపు అనివార్యం అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ అడ్డుకోదు అని, పూర్తిగా అది రాష్ట్ర పరిధిలోని అంశమని బిజెపి కేంద్ర పెద్దలు చెప్పిస్తున్నారు.బిజెపి అమరావతి విషయంలో ఒక క్లారిటీ కి వచ్చేయడంతో ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్ధకంగా మారింది.
బీజేపీ సహకారంతో తాము అమరావతి తరలింపు అడ్డుకుంటామంటూ ఇప్పటికే పవన్ ప్రకటించారు.బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి సైతం ఇదే మాట చెబుతున్నారు.కానీ ఇప్పుడు బిజెపి తన వైఖరిని స్పష్టం చేయడంతో వీరు ఏ విధంగా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది
.