తమను ఎంతగా విమర్శిస్తున్నా, దూరం పెట్టాలని ప్రయత్నిస్తున్నా, టిడిపి అధినేత చంద్రబాబు మాత్రం బిజెపి కి ఏదో ఒక రకంగా దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.అసలు బిజెపి, టిడిపితో జత కట్టే ప్రసక్తే లేదని పదేపదే చెబుతున్నా, చంద్రబాబు లో మాత్రం ఏదో ఒక ఆశ.
బీజేపీ తమతో పొత్తు పెట్టుకుంటే, రెండు పార్టీలకు మేలు జరుగుతుందని, జగన్ హవాను తగ్గించవచ్చని, ఇలా ఎన్నో రకాల అభిప్రాయాలతో ఉన్నారు.కానీ బీజేపీ మాత్రం టిడిపి విషయంలో క్లారిటీ గానే ఉంది.
మళ్లీ టిడిపితో పొత్తు అంటే, తమ వేలుతో తమ కంటిని పొడుచుకున్నట్టే అనే అభిప్రాయంలో ఉంది.అందుకే టీడీపీని దూరం పెడుతూ వస్తోంది.తాజాగా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి చెందిన రథం దగ్ధమైన వ్యవహారంలో బీజేపీ, జనసేన, టిడిపి లు వైసిపి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం, ఆందోళన నిర్వహించడం వంటివి చేశాయి.
ఈ వ్యవహారంలో బిజెపి, వైసీపీపై పెద్ద ఎత్తున విమర్శలు చేయడంతో అంతా ఆశ్చర్యపోయారు.
బిజెపి వైసిపి లు రెండు సఖ్యతతో ఉన్నాయని, ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్తున్నాయని, ఇలా ఎన్నో అభిప్రాయాల్లో ఉంది.ఇదిలా ఉంటే బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు మళ్లీ పూజల పేరుతో టీడీపీ రంగంలోకి దిగింది.
వారం రోజులపాటు రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో పూజల పేరుతో హడావుడి చేసేందుకు సిద్ధమైంది.నేటి నుంచే దానికి శ్రీకారం చుట్టింది.ఈరోజు అన్ని సూర్య దేవాలయల్లోనూ పూజలు నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.
అలాగే సోమవారం శివాలయాల్లోనూ, మంగళవారం ఆంజనేయ స్వామి, కుమారస్వామి ఆలయాల్లోనూ, బుధవారం అయ్యప్ప, గణపతి దేవాలయం, గురువారం సాయిబాబా ఆలయాల్లోనూ, శుక్రవారం కనకదుర్గ అమ్మవారి ఆలయం, శనివారం వైష్ణవాలయాల్లోనూ పూజలు నిర్వహించి, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేయాల్సిందిగా చంద్రబాబు పిలుపునిచ్చారు.ఇదే ఇప్పుడు అందరిలోనూ ఆశ్చర్యాన్ని, అనుమానాన్ని కలిగిస్తోంది.అసలు ఒక మతం వైపు నిలబడేందుకు చంద్రబాబు ఎప్పుడూ ప్రయత్నం చేయరు.
అలా చేస్తే మిగతా మతాలలో వ్యతిరేకత వస్తుందని భావించే వారు.
కానీ ఇప్పుడు వాటన్నిటిని పక్కన పెట్టేసి, హిందూ వాదన తలకెత్తుకోవడం వెనుక బీజేపీని ప్రసన్నం చేసుకొనే ఎత్తుగడలో భాగంగానే అనే విశ్లేషణలు మొదలయ్యాయి.
కానీ ఈ విషయంలో బిజెపి టిడిపి పై సానుకూలత వ్యక్తం చేస్తుందా, లేక దూరం పెడుతుందా అనేది క్లారిటీ లేదు.కాకపోతే బిజెపికి దగ్గరయ్యేందుకు ఇదే సరైన అవకాశం అని భావిస్తున్న టిడిపి ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని బిజెపికి దగ్గరయ్యేందుకు, వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది.
దీనికి తగ్గట్టుగానే చంద్రబాబు వైఖరి కనిపిస్తోంది.