రాజకీయ నాయకులనగానే ఓట్లు, సీట్లు, ఓటు బ్యాంకు రాజకీయాలు…ఇవే మనసులో మెదులుతాయి.ఇందులో భాగంగానే ఎన్నికల ముందరి ప్రచారంలో పేదల పట్ల చెప్పలేనంత అభిమానాన్ని ఒలకబోస్తుంటారు.
పబ్బం గడిస్తే చాలు.మళ్లీ ఎన్నికలు వచ్చేవరకు కనబడితే ఒట్టు.
అయితే ఒడిషా ఎమ్మెల్యే రమేష్ పటువా ఈ కోవకు చెందిన వాడు కాదు.పాడె మోసి మరీ బిచ్చగత్తె అంతిమ సంస్కారాలు నిర్వహించాడు.
ఝార్సుగూడ జిల్లాలోని అమ్నాపాలి గ్రామంలో ఓ వృద్ధురాలు తన మరిదితో కలిసి జీవించేది.భిక్షాటన చేస్తూ జీవనం సాగించే ఆమె అనారోగ్యంతో గత శనివారం మరణించింది.
అనారోగ్యం కారణంగా ఆమె మరిది అంత్యక్రియలు జరిపించలేకపోయాడు.ఇతర కుటుంబ సభ్యులు కూడా ముందుకు రాలేదు.
స్తానికులు కూడా ముందుకు రాలేదు.ఎందుకంటే తక్కువ కులానికి చెందిన శవాన్ని తాకితే తమను కులం నుంచి వెలి వేస్తారనే భయం.
ఈ విషయం తెలుసుకున్న బీజేడీ ఎమ్మెల్యే రమేష్ పటువా.అనాథలా పడి ఉన్న శవాన్ని ఖననం చేసేందుకు ముందుకొచ్చారు.తన కొడుకును, మేనల్లుడితోపాటు కొందరు మనుషులను పంపించి మృతదేహాన్ని శ్మశానానికి తీసుకొచ్చారు.తర్వాత దగ్గరుండి ఆమె శవాన్ని ఖననం చేయించారు.
విశేషం ఏమంటే రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరిలోకి రమేష్ అత్యంత బీదవాడు.ఇప్పటికీ అద్దె ఇంట్లోనే నివాసం.
గత నెలలో అసోం ఎమ్మెల్యే రూప్జ్యోతి కూర్మి (కాంగ్రెస్) కూడా ఇదే విధంగా తన మానవత్వాన్ని చాటుకున్నాడు.అంతిమ యాత్రకు డబ్బు లేని కటిక పేద చనిపోతే…పాడె మోసి మరీ కార్యక్రమాన్ని పూర్తి చేశాడు.