అమెరికా అందిస్తున్న ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ వి దేశాలపై వున్న పరిమితి (కంట్రీ క్యాప్)ని తొలగించడానికి యుఎస్ ప్రతినిధుల సభలో ద్వైపాక్షిక చట్టాన్ని ప్రవేశపెట్టారు.ఈ చట్టాన్ని కాంగ్రెస్ మహిళ జో లోఫ్గ్రెన్, కాంగ్రెస్ సభ్యుడు జాన్ కర్టిస్ ప్రవేశపెట్టారు.
దీనివల్ల దశాబ్దాలుగా గ్రీన్ కార్డ్ కోసం నిరీక్షిస్తున్న భారతీయ ఐటి నిపుణులకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది.లీగల్ ఎంప్లాయ్మెంట్ (ఈగల్) చట్టం, 2021 ప్రకారం గ్రీన్ కార్డులను సమానంగా జారీ చేసేందుకు గాను సెనేట్ ఆమోదించాలి.
అనంతరం ఇది అధ్యక్షుడి ఆమోదముద్ర తర్వాత చట్టంగా మారుతుంది.ఉపాధి ఆధారిత వలస వీసాలపై దేశానికి ఏడు శాతంగా వున్న పరిమితిని దశలవారీగా ఎత్తివేయాలని ఈ బిల్లులో ప్రస్తావించారు.
అలాగే ఫ్యామిలీ స్పాన్సర్డ్ వీసాలపై ఇప్పటి వరకు వున్న ఏడు శాతం పరిమితిని 15 శాతానికి పెంచాలని సూచించింది.
ఇమ్మిగ్రేషన్, పౌరసత్వంపై హౌస్ సబ్కమిటీ చైర్ ఎంఎస్ లోఫ్గ్రెన్ మాట్లాడుతూ.
వలసదారులకు వీసాలను కేటాయించే ప్రాథమిక చట్టం 20 వ శతాబ్దం మధ్యకాలం నాటిదన్నారు.దీనిలో చివరిగా 1990లో మార్పులు చేశారని ఆమె గుర్తుచేశారు.
వీసాల జారీకి సంబంధించి దేశాలపై కాంగ్రెస్ విధించిన ఏడు శాతం పరిమితి నేటికీ కొనసాగుతోందని లోఫ్గ్రెన్ అన్నారు.ఈ విధానంలో తక్కువ జనాభా వున్న దేశాలకు ఎక్కువగా గ్రీన్ కార్డులు మంజూరవుతుండగా.
భారత్, చైనా వంటి పెద్ద దేశాలకు ఏడు శాతం నిబంధన ప్రకారం కేటాయించే గ్రీన్కార్డులు ఏ మూలకు సరిపోవడం లేదు.
అసాధారణమైన అర్హతలు, నైపుణ్యాలు వున్న పెద్ద దేశానికి చెందిన వ్యక్తి మన ఆర్ధిక వ్యవస్థకు ఎంతో దోహదపడగలడని లోఫ్గ్రెన్ అభిప్రాయపడ్డారు.కానీ ఒక చిన్న దేశం నుంచి తక్కువ అర్హతలు వున్న వ్యక్తి నుంచి అలాంటి ప్రయోజనాలను మనం ఆశించలేమన్నారు.ఈ కొత్త ద్వైపాక్షిక ఈగిల్ చట్టం వల్ల అమెరికన్ కంపెనీలు ఉత్తమ మార్గాలను అన్వేషించేందుకు వీలు కలుగుతుందని లోఫ్గ్రెన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
మెరుగైన ఉత్పాదకత, సేవలు అందించే నైపుణ్యం కలిగిన వ్యక్తుల వల్ల అమెరికన్ జిల్లాల్లో ఉద్యోగ సృష్టి జరుగుందని ఆమె చెప్పారు.కాంగ్రెస్ సభ్యుడు కర్టిస్ మాట్లాడుతూ.2020 జనాభా లెక్కల ప్రకారం ఉటా.అమెరికాలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా వుందని తెలిపారు.సాంకేతిక రంగంలో వృద్ధి, ఆవిష్కరణల వల్ల రాష్ట్రానికి వేలాది కొత్త ఉద్యోగాలు వచ్చాయని కర్టిస్ అన్నారు.అదే సమయంలో ఉటా .అమెరికాలోనే అతి తక్కువ నిరుద్యోగిత రేటును కలిగి వుందన్నారు.
కాగా.వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికా వెళ్లిన పలువురు విదేశీయులు శాశ్వతంగా అగ్రరాజ్యంలో ఉండేందుకు గాను గ్రీన్కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటారు.ఇది సహజంగా జరిగే ప్రక్రియ.
అయితే వివిధ దేశాల నుంచి అమెరికాకు వలసలు భారీగా పెరగడంతో గ్రీన్కార్డుల జారీకి ఫెడరల్ ప్రభుత్వం తలలు పట్టుకుంటోంది.తీవ్రమైన పోటీ నేపథ్యంలో గ్రీన్కార్డులపై కోటా తీసుకొచ్చింది.
దీని ప్రకారం ప్రతి దేశానికి 7 శాతం చొప్పున గ్రీన్కార్డులు జారీ చేస్తూ వస్తోంది అమెరికా.ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చిన జో బైడెన్ ప్రభుత్వం గ్రీన్కార్డుపై దేశాల కోటా పరిమితిని ఎత్తేయడంతో పాటుగా దేశంలో చట్టవిరుద్ధంగా తలదాచుకుంటున్న 1.1కోట్ల మంది అక్రమ వలసదారులకు పౌరసత్వం కల్పించాలని భావించింది.దీనికి వీలు కల్పించే అమెరికా పౌరసత్వ బిల్లు 2021ని కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.