వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు ఆయా దేశాల్లో కీలక స్థానాల్లో వున్న సంగతి తెలిసిందే.భారత సంతతి క్రమంగా పెరగడంతో అక్కడి వ్యవస్థలను శాసించే స్థాయికి చేరుకున్నారు .
ఉదాహరణకు అమెరికాను తీసుకుంటే ఈ గడ్డ మీదకు అడుగుపెట్టిన భారతీయులు క్రమంగా ఇక్కడి సమాజంలో కీలక స్థానాన్ని ఆక్రమించారు.అన్ని రంగాల్లో దూసుకెళ్తూ స్థానిక అమెరికన్లతో పాటు అగ్రరాజ్యంలో స్ధిరపడిన మిగిలిన విదేశీయులకు పోటీ ఇస్తున్నారు.
ఇక అమెరికా తర్వాత ఇండియన్ కమ్యూనిటీ అత్యధికంగా స్దిరపడిన కెనడాలోనూ ఇటీవలి కాలంలో మనోళ్ల ఆధిపత్యం పెరుగుతోంది.సరళమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, త్వరితగతిన శాశ్వత నివాస హోదా లభిస్తుండటంతో భారతీయులు అమెరికాను పక్కనబెట్టి.
కెనడాకు దగ్గరవుతున్నారు.ఇటీవలి కాలంలో ఎన్నో సర్వేలు సైతం ఈ విషయాన్ని చెబుతున్నాయి.
ఇకపోతే కెనడాలోనూ భారతీయులు రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు.ఇప్పటికే చట్టసభ సభ్యులుగా, రాజకీయ పార్టీ నేతలుగానూ ఇండో కెనడియన్లు రాణిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మరణించిన ఓ భారత సంతతి రాజకీయ వేత్తకు కెనడా ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పించనుంది.దివంగత ఎమ్మెల్యే మన్మీత్ భుల్లర్కు కాల్గరీ- మెక్కాల్ నియోజకవర్గాన్ని… కాల్గరీ- భుల్లార్- మెక్కాల్గా పేరు మార్చడానికి కెనడాలోని అల్బెర్టా ప్రావిన్షియల్ ప్రభుత్వం బుధవారం సభలో బిల్లును ప్రవేశపెట్టింది.
మన్మీత్ భుల్లర్ అల్బెర్టాన్స్ గతంలో మౌలిక సదుపాయాలు, మానవ సేవల మంత్రిగా పనిచేశారు.మైనారిటీలు అలాగే అల్బెర్టాన్ సమస్యలపై చట్టసభల్లో గొంతేత్తారు.
కాల్గరీలో పుట్టి పెరిగిన భుల్లర్ పూర్వీకులు పంజాబ్లోని అమృత్సర్ సమీపంలోని రాయ గ్రామానికి చెందినవాడు.2008లో ఎన్నికల్లో గెలిచిన ఆయన చట్టసభల్లో ప్రవేశించిన అతి పిన్న వయస్కుడైన వ్యక్తిగా రికార్డుల్లోకెక్కారు.2008 మార్చి నుంచి 2015 నవంబర్లో చనిపోయే వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు భుల్లర్.2015లో క్యూఈ II హైవేపై ఓ వ్యక్తికి సహాయం చేస్తుండగా వాహనం ఢీకొట్టడంతో భుల్లర్ ప్రాణాలు కోల్పోయారు.కాల్గరీ మెక్కాల్ నుంచి ప్రోగ్రెసివ్ కన్జర్వేటివ్ పార్టీ కోసం ప్రాతినిధ్యం వహించారు.