కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం ఏ విధంగా అతలాకుతలమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.లాక్ డౌన్ తర్వాత చాలామంది వారి ఉద్యోగాలను కోల్పోయి ఆర్థికపరంగా చితికిపోయారు.
ఒక్కసారి కరోనా వైరస్ రాకముందు, వచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి అని ఒకసారి మనకు మనమే ఊహించుకుంటే చాలా తేడాలు కనపడతాయి.ఇప్పటికీ మనం బయటికి వెళ్ళాలి అంటే స్వేచ్ఛగా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.
ఏ ఒక్క నగరము ఏ ఒక్క రాష్ట్రము అని తేడా లేకుండా ప్రపంచం మొత్తం ఈ పరిస్థితిని ఎదుర్కొంటోంది.కరోనా వైరస్ ప్రభావం వల్ల ప్రతి రంగం కుంటుపడింది అని చెప్పవచ్చు.
ఒకటి రెండు రంగాల్లో తప్పించి మిగతా వాటి పై వీటి ప్రభావం పూర్తిగా పడింది.
ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో పేద వర్గాలకు సంబంధించిన వారు మరింత పేదవారిగా మారిపోయారు.
కొంతమందికి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించడం జరిగింది.ఇలా వివిధ వాటిపై సర్వే నిర్వహించిన తర్వాత గేట్ ఫౌండేషన్ నివేదికను తయారుచేసింది.
ఈ నివేదిక ప్రకారం ప్రపంచం మొత్తం గత 25 వారాలలో ఏకంగా 25 సంవత్సరాల వెనక్కి వెళ్లి పోయిందని బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తెలియజేసింది.కరోనా వైరస్ ప్రపంచాన్ని మొత్తం తిరోగమనం లోకి నెట్టేసిందని, అందువల్ల ప్రపంచంలోని ప్రతి ఒక్కరిపై వాటి ప్రభావం స్పష్టంగా కనబడుతుందని తెలుస్తోంది.
ఇక ఈ ఫౌండేషన్ ద్వారా పేర్కొన్న ప్రధాన అంశాల విషయానికొస్తే.కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పేదరికం 7 శాతం పెరిగిందని, ఆర్థిక నష్టం కారణంగా పెరిగిన అసమానతలను ఎదుర్కొనేందుకు కొత్త పరిష్కారాలను కనుగొనాలని తెలియజేశారు.
అంతేకాకుండా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలు వాటిని కొనుగోలు చేసేందుకు పోటీ పడతాయని తెలియజేసింది.దీంతో ధనిక దేశాలు మొదటి వ్యాక్సిన్ కొనుగోలు చేస్తే, పేద దేశాలలో మాత్రం వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే లోపల మరణాలు మరింత రెట్టింపు అవుతాయని తెలియజేసింది.