ఒకపక్క లాక్ డౌన్ కష్టాలతో జనాలు ఇబ్బందులు పడుతుంటే, కొన్ని కొన్ని చోట్ల చిత్ర విచిత్రమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.కరోనా మహమ్మారి,లాక్ డౌన్ కష్టాల ఎఫెక్ట్ అనేది చెప్పలేము గానీ ఇటీవల ఒక వ్యక్తి సైకిల్ దొంగతనం చేసి ఒక ఉత్తరం పెట్టి మరి వెళ్లిన ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
నాకు మరో మార్గం లేక మీ సైకిల్ దొంగతనం చేస్తున్నాను,క్షమించండి అని అంటూ ఒక దొంగ సైకిల్ దొంగిలించి అక్కడ లెటర్ పెట్టి వెళ్ళిపోయాడు.ఈ ఘటన తమిళనాడు లో చోటుచేసుకోగా,ఇలాంటి ఉదంతమే మరొకటి ఆ రాష్ట్రంలోనే చోటుచేసుకుంది.
కోయంబత్తూర్లోని పల్లపాళయానికి చెందిన సురేశ్ అనే వ్యక్తి తన బైక్ను గత నెల 18న తన వర్క్ షాపు ముందు నిలిపి ఉంచగా ఎవరో ఎత్తుకెళ్లారు.
దీనితో సురేష్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.
సీసీ కెమెరాల ఆధారంగా ఓ వ్యక్తి దాన్ని తీసుకెళ్లడం గమనించాడు.అయితే బండి తీసుకెళ్లిన వ్యక్తిని ప్రశాంత్ గా గుర్తించి అతని ఇంటికి వెళ్లి చూడగా అప్పటికే అతగాడు అక్కడ నుంచి చెక్కేసాడు.
మరోపక్క కరోనా కూడా విశ్వరూపం దాల్చడంతో దర్యాప్తు కూడా సాగలేదు.అయితే పదిహేను రోజుల తర్వత సురేశ్కు బైక్ పార్సిల్లో వచ్చిందని గూడ్స్ క్యారియర్ సంస్థ నుంచి ఫోనొచ్చింది.
పార్సిల్ ఆఫీసుకు వెళ్లిన సురేశ్ తన బైక్ కనిపించడతో సంతోషించాడు.రూ.1800 ట్రాన్స్ పోర్ట్ ఛార్జీలు కట్టి దాన్ని విడిపించుకున్నాడు.
అయితే పోయిందనుకుని హోప్స్ వదిలేసుకున్న తన బైక్ తిరిగి రావడంతో హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నారు.
అయితే బైక్ ను తీసుకెళ్లిన ఆ దొంగ తిరిగి ఎందుకు బైక్ ను పార్సిల్ చేసాడో అన్న విషయం అర్ధం కాలేదు.అయితే అతడు చోరీ చేస్తున్న దృశ్యాలకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడం తో ప్రశాంత్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
బైక్ను ఎత్తుకెళ్లిన ప్రశాంత్ మన్నార్ గుడికి వెళ్లి, భయంతో తిరిగి దాన్ని సురేశ్కు డెలివరీ చేశాడట.నిజంగా పోయింది అనుకున్న బైక్ తిరిగి మనదగ్గరకే పార్సిల్ రావడం మాత్రం లాక్ డౌన్ లో జరిగిన విచిత్రం అని చెప్పాలి.