దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది.నెలలు గడిచినా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం సాధ్యం కావడం లేదు.
ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు.దీంతో ఎన్నికల కమిషన్ సైతం బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపడుతోంది.దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి.
సీఎం నితీశ్ కుమార్ మరోమారు రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. బీహార్ లో ఇప్పటికే మద్యపాన నిషేధం అమలు చేసి నితీష్ మహిళల్లో మంచిపేరు సంపాదించుకున్నారు.
మద్యపాన నిషేధం అమలుతో ఆయనకు ప్రజల్లో వచ్చిన గుర్తింపు అంతాఇంతా కాదు.దీంతో మహిళా ఓటర్లను ఆకర్షించే దిశగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.ఇంటర్ పాసైన బాలికలకు 25 వేల రూపాయలు ఇవ్వనున్నట్టు ప్రకటన చేశారు.
డిగ్రీ పాసైన బాలికలకు 50 వేల రూపాయలు అందజేయనున్నట్టు ప్రకటించారు.
సీఎం తీసుకున్న ఈ నిర్ణయం బాలికల తల్లిదండ్రులతో పాటు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.నితీష్ కుమార్ మహిళల అక్షరాస్యతను ప్రోత్సహించడానికే పాసైన విద్యార్థినులకు డబ్బులు ఇస్తున్నామని పేర్కొన్నారు.
ఉపాధి అవకాశాలను మెరుగుపరచటానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
ఎన్నికల సంఘం బీహార్ రాష్ట్ర ఎన్నికలను మొత్తం మూడు దశల్లో పూర్తి చేయనుంది.
వచ్చే నెల 28వ తేదీన 243 నియోజకవర్గాలకు తొలి విడత పోలింగ్ జరగనుంది.నవంబర్ 3, నవంబర్ 7 తేదీలలో రెండో విడత, మూడో విడత పోలింగ్ జరగనుండగా నవంబర్ 10వ తేదీన ఫలితాలు వెలువడుతాయి.
రాష్ట్రంలో మరోమారు నితీశ్ అధికారంలో వస్తారో లేదో చూడాల్సి ఉంది.బీహార్ ప్రజలు మాత్రం మరోసారి నితీష్ అధికారంలోకి రావచ్చని అభిప్రాయపడుతున్నారు.