బుల్లితెరపై బిగ్ బాస్ షోకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కొందరు సెలబ్రిటీలుగా గుర్తింపు పొందిన తరువాత ఈ షోకు వస్తే మరి కొందరికి ఈ షోలో పాల్గొన్న తరువాత సెలబ్రిటీ స్టేటస్ దక్కింది.
పది రోజుల క్రితం ప్రారంభమైన ఈ షోలో అందరి దృష్టిని ఆకర్షించిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే ఆ కంటెస్టెంట్ గంగవ్వే అని చెప్పాలి.సాధారణంగా ఎవరైనా బిగ్ బాస్ షోకు ఎంపికయ్యామని తెలిస్తే ముందుగానే దానికి తగినట్టు ప్లాన్స్ వేసుకోవడం, ఇతరుల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవడం చేస్తారు.
అయితే గంగవ్వకు మాత్రం షోలో పాల్గొనే నాటికి బిగ్ బాస్ షో అంటే ఏంటో కూడా తెలీదు.ఆరు పదుల వయస్సులో అంతమంది యువ కంటెస్టెంట్లు ఉన్నా అందరి దృష్టిని గంగవ్వ ఆకర్షిస్తోంది.
గంగవ్వ ఎలిమినేషన్ కు నామినేట్ అయినా ఖచ్చితంగా సేఫ్ అవుతుందని కంటెస్టెంట్లు భావిస్తున్నారు.తొలివారంతో పోలిస్తే గంగవ్వకు పడే ఓట్ల శాతం తగ్గిందని వార్తలు వస్తున్నా గంగవ్వ అందించే ఎంటర్టైన్మెంట్ ఇంకెవరూ అందించలేరు.
మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ గంగవ్వకు పేరు తీసుకురాగా గంగవ్వ పలు సినిమాల్లో కూడా నటించింది.అయితే గంగవ్వ వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
జీవితంలో గంగవ్వ పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు.చిన్నతనంలోనే గంగవ్వకు తల్లితండ్రి మరణించగా ఆమె భర్త తాగుడుకు బానిసయ్యాడు.
భర్త సహకారం లేకుండానే గంగవ్వ ఇద్దరు కూతుళ్లు, కొడుకు పెళ్లి చేసింది.
ఇస్మార్ట్ శంకర్, మల్లేశం సినిమాల్లో గంగవ్వ చేసిన పాత్రలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.
గంగవ్వ కొడుకు పేరు రాజారెడ్డి.మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ కు ఆయన డైరెక్టర్ గా పని చేశారు.
కొన్ని నెలల క్రితం ఆత్మహత్యాయత్నం చేసి ఆయన వార్తల్లో నిలిచారు.గతేడాది జరిగిన ఈ ఘటన వల్ల గంగవ్వ తీవ్ర మనోవేదనకు గురైంది.