బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షోలో ప్రతి సీజన్ లో టీవీ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్ ఒకరు ఉండే విధంగా బిగ్ బాస్ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటారు.అలా ఈ సీజన్ లో యాంకర్ లాస్య బిగ్ బాస్ సీజన్ 4కు వచ్చారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో లాస్యను అభిమానించే ప్రేక్షకులు భారీగా ఉండటంతో లాస్య టాప్ 5 కంటెస్టెంట్లలో ఉండవచ్చని అందరూ భావించారు.అయితే ఊహించని విధంగా 11వ వారం ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.
బిగ్ బాస్ హౌస్ లో లాస్య కిచెన్ కే ఎక్కువ పరిమితం కావడం, టాస్కులపై పెద్దగా ఆసక్తి చూపకపోవడం, ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అందించలేక పోవడం వల్ల ఆమె బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారని చాలామంది భావిస్తారు.తాజాగా బిగ్ బాస్ షో గురించి కుటుంబ సభ్యుల నుంచి ఎదురైన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఒక వీడియో విడుదల చేసిన లాస్య బిగ్ బాస్ హౌస్ లో దోమల వల్ల చాలా ఇబ్బందులు పడ్డానని అవి చాలా టార్చర్ చేశాయని చెప్పారు.
బిగ్ బాస్ హౌస్ లో డోర్లు వేస్తే దోమలు వచ్చేవి కాదని గార్డెన్ ఏరియాలో మాత్రం దోమలు కుట్టేవని వాటి వల్ల ఇబ్బందులు పడ్డానని లాస్య తెలిపారు.బిగ్ బాస్ హౌస్ లోకి కుటుంబ సభ్యుల ఫోటోలను కూడా తీసుకెళ్లడానికి ఉండదని అక్కడ వాషింగ్ మెషీన్లు కూడా ఉండవని తెలిపారు.బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు కరెంట్ ప్రాబ్లమ్ అయితే రాలేదని అయితే అప్పుడప్పుడూ జనరేటర్ సౌండ్ మాత్రం వినిపించేదని అన్నారు.
రాత్రి మిగిలిన అన్నంతో ఉదయం రకరకాల వంటకాలు చేసేదానినని అయితే కంటెస్టెంట్లు చాలామంది ఆ వంటలను తినడానికి పెద్దగా ఇష్టపడేవారు కాదని లాస్య తెలిపారు.
ప్రతిరోజూ వచ్చే వేకప్ సాంగ్ ఎవరు ప్లే చేస్తారో తనకు తెలియదని.డైరెక్షన్ టీమ్ వాళ్లు ప్లే చేస్తారని తాను అనుకుంటానని అన్నారు.బిగ్ బాస్ ఎక్కడినుంచి మాట్లాడతారని అందరూ అడుగుతున్నారని అయితే కన్ఫెషన్ రూమ్ పక్కన ఉండే చిన్న రూమ్ నుంచి బిగ్ బాస్ మాట్లాడుతున్నాడని తాను అనుకుంటున్నానని లాస్య తెలిపారు.