బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ పై ఎలిమినేట్ అయిన మరో కంటెస్టెంట్ జోర్దార్ సుజాత సంచలన వ్యాఖ్యలు చేసింది.చాలామంది ప్రేక్షకులు సుజాత నవ్వులో నిజాయితీ లేకపోవడం, ఆమె నాగార్జునను బిట్టూ అని పిలవడం వల్లే ఎలిమినేట్ అయిందని భావిస్తున్నారు.
అయితే నాగార్జునను అలా బిట్టూ అని పిలవడం వెనుక కారణాలను చెప్పి సుజాత బిగ్ బాస్ గుట్టు విప్పారు. బిగ్ బాస్ షో స్క్రిప్టెడ్ అనే అనుమానాలు నిజం అనేలా సుజాత వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.
బిగ్ బాస్ ఐదో వారంలో అందరూ ఊహించినట్టుగానే ఎలిమినేట్ అయిన సుజాత టీవీ ఛానెళ్లకు, యూట్యూబ్ చానెళ్లకు ఇంటర్యూలు ఇస్తున్నారు.ఈ ఇంటర్వ్యూలో బిట్టూ అని బిగ్ బాస్ నిర్వాహకులే పిలవమన్నారని చెప్పారు.
తాను బిగ్ బాస్ ఇంటర్యూకు వెళ్లిన సమయంలో తనను నాగార్జున అంటే ఇష్టమా.? అని అడిగారని తాను నాగార్జున అంటే చాలా ఇష్టమని.అందులోనూ ఆయన మనం సినిమాలో చేసిన బిట్టూ పాత్ర మరింత ఇష్టమని అన్నారు.
ఆ తరువాత ఇంటర్వ్యూలు చేసేవాళ్లు తనను నాగార్జునను బిట్టూ అని పిలవడానికి ఇష్టమేనా.? అని అడగగా తాను సరేనని పిలవడానికి అంగీకరించానని చెప్పారు.నాగార్జున సర్ ను అలా పిలిచిన సమయంలో ఆయన ఎంతో సంతోషంగా కనిపించారని.
తాను అలా పిలవడం నాగార్జునకు కానీ, బిగ్ బాస్ నిర్వాహకులకు కానీ నచ్చకపోతే కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి తనకు ఆ విషయం చెప్పేవారంటూ బిగ్ బాస్ షో గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను కావాలని నాగార్జునను బిట్టూ అని పిలవలేదని.
తాను అలా పిలవడం వల్ల నాగార్జున అభిమానులు బాధ పడితే మాత్రం తనను క్షమించాలని అన్నారు.వయస్సులో తన కంటే ఎంతో పెద్దవారైన నాగార్జునను సుజాత బిట్టూ అని పిలవడం ఆయన అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.
ఆమె అలా పిలవడంపై సోషల్ మీడియాలో కొందరు నాగార్జున అభిమానులు ఆమెను ట్రోల్ చేశారు.బిగ్ బాస్ నిర్వాహకులే అలా పిలవమన్నారని సుజాత చెప్పడంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.