రాజ్యసభలో త్వరలో ఖాళీ కానున్న స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది.జూన్ 10న రాజ్యసభ ఎన్నికల కోసం పోలింగ్ జరగనుంది.
అదే రోజు ఓట్ల లెక్కింపు జరగనుంది.దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాలకు చెందిన 57 మంది రాజ్యసభ ఎంపీల పదవీ కాలం త్వరలో పూర్తి కానుంది.
ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలలో ఏపీకి చెందిన నాలుగు స్థానాలు ఉన్నాయి.ఈ నాలుగు కూడా అధికార పార్టీ వైసీపీ ఖాతాలోకే చేరనున్నాయి.
ఎందుకంటే ప్రస్తుతం వైసీపీకి ఫుల్ మెజారిటీ ఉంది.ఎంపీల బలం కూడా ఆ పార్టీకే ఎక్కువ ఉంది.మరోవైపు ఏపీలో టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.వీరిలో కూడా పలువురు వైసీపీకి మద్దతు పలుకుతున్నారు.
కానీ రాజ్యసభ సీటు గెలవాలంటే 44 ఓట్లు అవసరం.దీంతో టీడీపీకి రాజ్యసభ సీటు వచ్చే అవకాశమే లేదు.
ఈ నేపథ్యంలో త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ గెలుపు లాంఛనమే అని భావించాలి.
జూన్ 10న జరిగే రాజ్యసభ ఎన్నికల తర్వాత పెద్దల సభలో వైసీపీ బలం 9కి చేరనుంది.
అంతేకాకుండా త్వరలోనే మరో రెండు స్థానాలు కూడా వైసీపీ ఖాతాలో చేరనున్నాయి.2024లో మరో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.ఆ సీట్లలో ఒకటి వైసీపీకి చెందిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిది. ఆయన పదవీకాలంతో పాటు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ పదవీకాలం 2024 ఏప్రిల్ 22తో పూర్తి అవుతుంది.
ఇక టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ పదవీకాలం కూడా అదే రోజుతో పూర్తి కానుంది.
2024లో జరిగే ఈ మూడు స్థానాల ఎన్నికల్లోనూ వైసీపీనే గెలుస్తుందని ఇప్పుడే చెప్పవచ్చు.2024 నాటికి వైసీపీకే బలం ఉంటుంది కాబట్టి రాజ్యసభలో ఆ పార్టీ బలం 11కి చేరుతుంది.దీంతో ఏపీ నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ 11 రాజ్యసభ స్థానాలను దక్కించుకుని రికార్డు క్రియేట్ చేయనుంది.అంతేకాకుండా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ బలం జీరోకి చేరనుంది.2024లో ఒకవేళ టీడీపీ అధికారంలోకి వచ్చినా రాజ్యసభలో బలం కోసం ఆ పార్టీ 2026 వరకు వేచి చూడాల్సిందే.