కరోనా మహమ్మారి కారణంగా విదేశాలలో ఉంటున్న ఎంతో మంది ప్రవాసులు వారి వారి ప్రాంతాలకు వచ్చేసిన విషయం విధితమే.దాంతో తమ దేశంలోకి విదేశీయులను అనుమతించేది లేదంటూ అన్ని దేశాలు కరోనా ఆంక్షలు విధించాయి.
ఈ నేపధ్యంలో రాకపోకలు నిలిచిపోవడంతో భారత్ నుంచీ వివిధ దేశాలకు వెళ్ళే భారతీయులు ఎంతో మంది స్వదేశంలోనే ఉండిపోయారు.ముఖ్యంగా కువైట్ వంటి దేశాలలో కార్మికులుగా చేస్తున్న ఎంతో మంది పరిస్థితి దయనీయంగా మారింది.
అయితే దాదాపు సంవత్సరం ఆరు నెలల తరువాత కువైట్ తమ దేశంలోకి భారతీయులు రావచ్చంటూ పిలుపునిచ్చింది.దాంతో విమానయాన సంస్థలు ఒక్కసారిగా టిక్కెట్టు ధరలు పెంచేశాయి.
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టుగా ప్రయాణీకుల నుంచీ డబ్బులు గుంజేయడానికి ఒక్క సారిగా అమాంతం టిక్కెట్ల ధరలు పెంచేశాయి.షెడ్యూల్ విమానాలు నడిపితే తమకు ఒరిగేది లేదని భావించిన సంస్థలు వాటికి బదులుగా చార్టర్డ్ విమానాలు నడిపేందుకు సిద్దమయ్యాయి.భారత్ నుంచీ కువైట్ వెళ్ళే షెడ్యూల్ విమాన ధర రూ.15 వేల నుంచీ రూ.20 వేల వరకూ ఉంటుంది.అయితే చార్టర్డ్ విమాన ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుకునేలా ఉన్నాయి.భారత్ నుంచీ కువైట్ వెళ్ళడానికి చార్టర్డ్ విమాన ధర రూ.1.50 లక్షలు వరకూ విధించడంతో కువైట్ వెళ్ళడానికి ఏడాదిగా ఎదురు చూస్తున్న ప్రవాసులు గొల్లు మంటున్నారు.
కువైట్ ఆగస్టు 22 నుంచే తమ దేశంలో ప్రయాణాలకు అనుమతి ఇచ్చినా ఇప్పటి వరకూ విమానయాన సంస్థలు షెడ్యూల్ విమానాలు నడపలేదని టిక్కెట్ల ధరలపై ప్రభుత్వాలకు అజమాయిషీ లేకపోవడం వలనే విమాన సంస్థలు తమకు ఇష్టం వచ్చినట్లుగా రెట్లు పెంచుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కువైట్ లో తాము కార్మికులుగా ఉంటూ కుటుంభాలు పోషించుకుంటున్నామని ఇలా అడ్డగోలుగా ధరలు పెంచడం సమంజసం కాదని ఇప్పటికైనా ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు ప్రవాసులు.